రెండు నోట్బుక్స్ ఐదు వేరియంట్లలో లాంచ్ చేసిన షావోమీ
By: chandrasekar Sat, 13 June 2020 8:07 PM
చైనా టెక్ సంస్థ షావోమీ
గురువారం రెండు నోట్బుక్స్ ఐదు వేరియంట్లలో లాంచ్ చేసింది. వీటి ధర 41,999 నుంచి 59,999 వరకూ ఉంది. ఈ సంస్థ మొదటిసారి పీసీ మార్కెట్లోకి
అడుగుపెట్టింది.
కరోనా మహమ్మారి వల్ల చాలా
మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండడం, చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు
హాజరవుతుండడంతో ల్యాప్టాప్స్ డిమాండ్ పెరుగుతుందని భావించిన సంస్థ వీటిని తయారు
చేసింది. లద్దాఖ్లో భారత-చైనా సైన్యం మధ్య ఉద్రిక్తతలతో దేశంలో చైనా వ్యతిరేక
సెంటిమెంట్ తీవ్రంగా ఉన్న సమయంలో, రైట్ వింగ్ మద్దతుదారులు ఎంతోమంది చైనా ఉత్పత్తులను
బహిష్కరించాలని పిలుపునిస్తున్న తరుణంలో, సంస్థ ఈ కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది.
45 కోట్ల మందికి పైగా వినియోగదారులతో, భారత్లో
అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇప్పుడు సగానికి పైగా చైనా
కంపెనీల నియంత్రణలో ఉంది. దాని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు. బీబీసీ ప్రతినిధి నిధి రాయ్ స్కైప్
ద్వారా షావోమీ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ను ఇంటర్వ్యూ
చేశారు. చైనా వ్యతిరేక సెంటిమెంట్ సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నా, అది
ఇంకా తమ వ్యాపారంపై ప్రభావం చూపించలేదని ఆయన చెప్పారు.