'మిరప’ సాగు కోసం రైతులు తెలుసుకోవలసిన విషయాలు
By: chandrasekar Fri, 26 June 2020 7:42 PM
రైతులను మోసం చేసే
నర్సరీదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
రూ.50 వేల
జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.
రాష్ట్రంలో పండించే సుగంధ
ద్రవ్యాలలో ఎండు మిరప ప్రధానమైంది. సుమారు 2.2 లక్షల ఎకరాల్లో మిరప సాగుచేస్తుండగా, సాలీనా
4.4 లక్షల
మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్నది. ఖమ్మం, వరంగల్ (అర్బన్, రూరల్), జయశంకర్
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లితోపాటు
జోగులాంబ గద్వాల జిల్లాల్లో మిరపను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇందుకోసం రైతులకు
ఏటా 22 కోట్ల
నుంచి 24 కోట్ల
మొక్కలు అవసరమవుతున్నాయి.
వీటిని రైతులు రెండు
పద్ధతుల ద్వారా సేకరించి మిరప సాగు చేస్తుంటారు. మొదటిది నేరుగా విత్తనాలు
కొనుగోలు చేసి, నారుమళ్లు పెంచుతారు. మొక్కలను తీసి, చేనులో
నాటుతారు. రెండోది నేరుగా నర్సరీల నుంచే మిరప మొక్కలను ఖరీదు చేస్తారు. ప్రస్తుత
సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 148 నర్సరీలలో 24.37 కోట్ల వివిధ రకాల మిరప నారు ఉత్పత్తి చేస్తున్నారు.ఖమ్మం జిల్లాలో 103
నర్సరీలు (15.45 కోట్ల మొక్కలు), సూర్యాపేట జిల్లాలో 22 నర్సరీలు (5.72 కోట్ల
మొక్కలు), మహబూబాబాద్
జిల్లాలో 13 నర్సరీలు (2.80 కోట్ల మొక్కలు) ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే
నాసిరకం, కల్తీ
విత్తనాలు, కల్తీనారు రైతులకు ప్రధాన సమస్యగా మారుతున్నది.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, కల్తీ విత్తనాలు, నారు సరఫరాను అడ్డుకునేందుకు నిర్ణయించింది.
కల్తీదారులపట్ల కఠినంగా వ్యవహరించేందుకు పలు నియమ నిబంధనలను రూపొందించింది.
ప్రతి నర్సరీ యజమాని
జిల్లా ఉద్యాన అధికారి వద్ద తమ నర్సరీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ను తప్పకుండా
చేయించుకోవాలి. మిరప మొక్కల కనీస వయస్సు 40 నుంచి 45 రోజులు ఉండాలి. ఎత్తు 15-24
సెం.మీ. ఉండాలి. ఆరోగ్యవంతమైన కాండం దృఢంగా ఉండి, ఎలాంటి చీడ పీడలు, సూక్ష్మధాతు
లోపాలు లేకుండా చూడాలి. నర్సరీల్లో అనుకూలమైన భూమి, నీటి సౌకర్యంతోపాటు
చుట్టూ ఫెన్సింగ్, మొక్కల పెంపకానికి అవసరమైన నిర్మాణాలు తప్పనిసరిగా
కలిగి ఉండాలి. నాణ్యమైన కోకోపిట్ వాడాలి.
మిరప నారుకు సంబంధించిన
సమగ్ర వివరాలతో నర్సరీ యజమాని రిజిస్టర్లను నిర్వహించాలి. అందులో విత్తనాల సేకరణకు
సంబంధించిన మూల వివరాలు, బిల్లులు, లాట్, బ్యాచ్ నంబర్లు, విత్తన పరీక్షకు సంబంధించిన వివరాలతోపాటు విత్తన
తయారీ తేదీలాంటి వివరాలను కూడా రిజిస్టర్లలో నమోదుచేయాలి. ఉత్పత్తిచేసిన మొక్కలు, అమ్మిన
మొక్కల వివరాలతో రిజిస్టర్ నిర్వహించాలి. రైతులు బిల్లు తీసుకొనే నాణ్యమైన నర్సరీ
మొక్కలను కొనుగోలు చేయాలి.