Breaking: అన్ని రైతు బజార్లలో తక్కువ ధరకు ఉల్లి అమ్మకాలు...!
By: Anji Fri, 23 Oct 2020 06:23 AM
సామాన్యులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ఘాటు విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా రాయితీపై రూ.40కే కిలో ఉల్లిపాయలు ఈ రోజు నుంచి అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఎలాంటి చర్యలు తీసుకుంటోందన్న వివరాలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు సీఎం జగన్ అధికారులకు ఆదేశించినట్లుగా తెలిపారు. 5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నామని.. తక్షణమే వెయ్యి టన్నులు మార్కెట్లోకి తీసుకువచ్చి రైతుబజార్లలో విక్రయిస్తామని తెలిపారు.
మొదటి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి ఒక కేజీ వంతున రొటేషన్ పద్దతిలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
భారీ వర్షాల వల్ల మన రాష్ట్రంలో కర్నూలు సహా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు,కర్నాటక, కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరగడంతో ఉల్లిరేటుకు రెక్కలొచ్చాయన్నారు. కాగా రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతోందని.. మరో నెలలో కొత్త పంట కొంత అందుబాటులోకి వస్తుందన్నారు.