మరో సంచలన నిర్ణయం... పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం...!
By: Anji Mon, 16 Nov 2020 9:34 PM
బ్రిటన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఆ దేశంలో 2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం విధించాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
దీనిపై త్వరలోనే ఆయన వచ్చేవారం ఒక ప్రకటన చేయవచ్చని సమాచారం. ఈ విషయాన్ని ఆంగ్ల వార్తపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకటించింది.
వాస్తవానికి బ్రిటన్ 2040 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది, కానీ, బోరిస్ జాన్సన్ అధికారం చేపట్టాక గడువును 2035గా మార్చింది.
ఇప్పుడు దానిని మరింత ముందుకు తెచ్చి 2030కి కుదించే అవకాశం ఉంది. వచ్చే వారం బోరిస్ జాన్సన్ పర్యావరణ పాలసీపై కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గడువును 2030కు కుదిస్తారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
బీబీసీ కూడా ఇటువంటి రిపోర్ట్ను గత వారం ప్రచురించింది. దీనిపై వ్యాఖ్యానించేందుకు ప్రధాని కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు.
ఇక పెట్రోల్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ల కలయికతో ఉండే హైబ్రీడ్ కార్లకు మాత్రం దీని నుంచి మినహాయింపు రావచ్చని సమాచారం, పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలు ముగిస్తే అది బ్రిటన్ ఆటోమొబైల్ మార్కెట్లలో అతిపెద్ద మలుపు అవుతుంది.
ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో ఈ రెండు రకాల కార్ల వాటా 73.6శాతం ఉంది. ప్రభుత్వం ప్రకటిస్తే ఆ దేశ ఆటోరంగం ఆర్థిక వ్యవస్థపై బలమైన దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.