కరోనా కేసుల సంఖ్య పెరగడంతో నీట్, జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా
By: chandrasekar Sat, 04 July 2020 11:51 AM
కరోనా వైరస్
విజృంభిస్తున్నసమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, జేఈఈ
పరీక్షలను మరోసారి వాయిదా వేసింది. నీట్, జేఈఈ పరీక్షలను సెప్టెంబర్ వరకు వాయిదా వేస్తున్నట్లు
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన
ట్వీట్ చేశారు. పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు, సెప్టెంబర్
27న జేఈఈ
అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
విద్యార్థుల భద్రత
దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక
సంస్థల్లో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్, జేఈఈ
పరీక్షలు వాస్తవానికి గత నెలలోనే జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న
నేపథ్యంలో జులైకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిస్థితిలో మార్పు
రాక పోగా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుండటంతో తాజాగా మరోసారి వాయిదా వేశారు.