అర్ధరాత్రిళ్లు చిరుతిళ్లు తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయని నిపుణుల హెచ్చరిక
By: chandrasekar Sat, 11 July 2020 6:46 PM
సమయానికి ఆహారాన్ని
తినకపోవడం తో అర్ధరాత్రిళ్లు ఆకలేసి ఏది పడితే అది తినేస్తారు. దీనివల్ల ఆరోగ్యం
చెడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రిళ్లు లేదా లేటుగా డిన్నర్
చేసి తినేవారి రక్తంలో చక్కెర శాతం విపరీతంగా పెరిగిపోతుందని ఓ సర్వేలో తేలింది.
అంతేగాక శరీరానికి చేటు చేసే కొవ్వులు పెరిగి గుండె సమస్యలు వస్తాయని
హెచ్చరించింది. మన పూర్వికులు కూడా చాలాసార్లు ఈ విషయంపై హెచ్చరించిన సందర్భాలు
ఉన్నాయి.
ఎవరైనా అర్ధరాత్రిళ్లు
లేచి గిన్నెలు వెతుక్కుంటే వారిని ‘దెయ్యం తిండి’ తింటున్నారని అనేవారు. దెయ్యం
తిండి తినడం మంచిది కాదని, అనారోగ్యానికి గురవ్వుతారని హెచ్చరించేవారు. వారి
మాటలు ముమ్మాటికీ నిజమేనంటూ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం గతంలో తేల్చి చెప్పింది.
చాలామందికి ఫ్రిజ్లో ఆహారం ఉన్నా లేకున్నా దాన్ని తెరిచి చూడటం అలవాటు. ఒక వేళ
అందులో ఏమైనా ఉంటే తినకుండా వదిలిపెట్టరు.
ముఖ్యంగా నగర జీవితానికి
అలవాటుపడే యువతకు ఎక్కువగా ఇదే అలవాటు. టీవీలు, సెల్ఫోన్లు చూస్తూ ఆలస్యంగా నిద్రపోతారు. ఫలితంగా
రాత్రి వేళ చిరుతిళ్లు తింటూ టైంపాస్ చేస్తారు. తమకు నచ్చిన జంక్ఫుడ్ను
లాంగించేస్తారు. అయితే, ఈ ఆహారం మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతాయని
పరిశోధనల్లో తేలింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల
పాటు లేట్నైట్ జంక్ఫుడ్ తినే వారిని ప్రత్యేకంగా పరిశీలించారు.
వారి వివరాలను సేకరించి
వారి ఆరోగ్య పరిస్థితులపై నిఘా పెట్టారు. నిద్రకు ముందు జంక్ఫుడ్, స్నాక్స్
తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైనట్లు తెలుసుకున్నారు. ఇలాంటి వారిలో
జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని తెలుసుకున్నారు. రాత్రివేళ్ల జంక్ ఫుడ్
తింటే నిద్రలేమి సమస్యలు వేధిస్తాయని మరికొన్ని సర్వేలు వెల్లడించాయి.