అలాంటి ఫోన్ కాల్స్ తో జాగ్రత్త ..సైబర్క్రైమ్ పోలీసులు
By: Sankar Sun, 21 June 2020 5:24 PM
టెక్నాలజీ యుగంలో మోసాలు రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి..ఆన్లైన్ మనీ ట్రాన్సక్షన్స్ వచ్చిన తర్వాత మోసగాళ్లు ఎక్కువగా వాటిపైననే ద్రుష్టి కేంద్రీకరిస్తున్నారు ..గత ఆరు నెలలుగా పేటీఎం, ఇతర యూపీఐల నుంచి నో యువర్ కస్టమర్ (కైవేసీ) వివరాలు అప్డేట్ చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సెల్ఫోన్లకు కాల్ చేస్తూ.. ఇంకోవైపు సంక్షిప్త సమాచారాలు పంపుతూ వల వేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్ల మాయలో పడిన బాధితులకు కేవైసీ అప్డేట్ చేసే సమయంలో యాప్లు డెస్క్ యాప్, క్విక్ సపోర్ట్ యాప్, టీమ్ వీవర్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని చెబుతారు. అది అయిందా, లేదా అని తనిఖీ చేసేందుకు తొలుత రూ.1, లేదంటే రూ.100లు బదిలీ చేయాలని నమ్మబలుకుతారు.
ఈ సమయంలో బాధితుడి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే హ్యాక్ చేసి లక్షల్లో డబ్బులను తమ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. ఇలా గత ఆరు నెలల నుంచి సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 50కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈతరహా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
పేటీఎం అకౌంట్లైనా, ఇతర ఖాతాలైన ఆయా సంస్థ ప్రతినిథులు ఫోన్ కాల్ చేసి కేవైసీ వివరాలు అప్డేట్ చేయమని అడగరు. ఎస్ఎంఎస్లు కూడా పంపరు. అకౌంట్ వివరాలను ఎవరికీ చెప్పవద్దు. వివిధ అప్లికేషన్లు అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా డౌన్లోడ్ చేసుకోవద్దు. తనిఖీ కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాకు అసలు డబ్బులు బదిలీ చేయవద్దు. మీ నాలెడ్జ్ లేకుండానే, మిమ్మల్ని మోసగించి డౌన్లోడ్ చేయించిన అప్లికేషన్ల ద్వారా మీ బ్యాంక్ ఖాతా వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి లక్షలు కాజేసే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.