సామూహిక లైంగిక దాడి బాధితురాలి కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
By: Sankar Wed, 30 Sept 2020 8:13 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో సామూహిక లైంగిక దాడికి గురై మరణించిన యువతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఈ కేసు దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి ప్రభుత్వం చెప్పింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేను విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని వెల్లడించింది. దీనికి ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం బాధిత కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ నెల 20న హత్రాస్లో సామూహిక లైంగికదాడికి గురైన 19 ఏండ్ల యువతి ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల కిందట చనిపోయింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. మరోవైపు పోలీసులు అర్థరాత్రి వేళ ఆ యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం వివాదానికి దారి తీసింది. తమను ఇంట్లో నిర్బంధించి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే యువతి తండ్రి, సోదరుడి అనుమతితోనే రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు