రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న టీఎస్ యూటీఎఫ్
By: chandrasekar Thu, 18 June 2020 09:51 AM
తెలంగాణ లాక్డౌన్
ప్రభావంతో రాష్ట్ర ఆదాయం తీవ్రంగా పడిపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధులకు
చెల్లించే వేతనాల్లో ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. పెన్షన్లలోనూ కోతలు
విధించడాన్ని సవాల్ చేస్తూ పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. పెన్షన్లలో కోత
విధించే అధికారం తమకు ఉందని హైకోర్టులో ప్రభుత్వం వాదించగా ఏ హక్కు ఉందో చెప్పాలని
న్యాయస్థానం సర్కారును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్ల
చెల్లింపుల విషయమై తెలంగాణ సర్కారు జూన్ 16న రాత్రి సమయంలో ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది.
రాష్ట్రంలో ఏవైనా
విపత్తులు లేదా ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఏ
వ్యక్తికైనా, సంస్థకైనా, పెన్షనర్లకైనా చెల్లింపులను వాయిదా వేసే అధికారం
ప్రభుత్వానికి కల్పించేలా ఈ ఆర్డినెన్స్ను రూపొందించారు.
ఉద్యోగులు, పెన్షనర్ల
వేతనాలు, పెన్షన్లలో
కోతలపై కోర్టులో సమాధానం చెప్పుకోలేక రాత్రికి రాత్రే ప్రభుత్వం ఆర్డినెన్స్
తీసుకొచ్చిందని టీఎస్యూటీఎఫ్ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు
విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లో
కోత వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కోతను ఇంకా
కొనసాగించే ఉద్దేశంతోనే ఆర్డినెన్స్ను తీసుకొచ్చారని టీఎస్ యూటీఎఫ్ ఆరోపించింది.
ఆర్డినెన్స్ను ఉపసంహరించుకుని జూన్ నెల నుంచి పూర్తి వేతనాలను చెల్లించాలని
డిమాండ్ చేసింది.