బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కు సవాల్ విసిరిన హుజూర్నగర్ ఎమ్యెల్యే సైదిరెడ్డి
By: Sankar Tue, 03 Nov 2020 6:34 PM
భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్కు హుజుర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్ విసిరారు. హుజుర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.. అదేమైందని బండి సంజయ్ అన్నారు. సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత.. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గం తలరాత మారిందని సైదిరెడ్డి స్పష్టం చేశారు.
రూ. 100 కోట్ల కంటే ఎక్కువగానే సీఎం కేసీఆర్ నిధులిచ్చి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. హుజుర్నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బండి సంజయ్కు ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బుధవారం చర్చకు సిద్ధం అని సైదిరెడ్డి స్పష్టం చేశారు.
దమ్ముంటే బండి సంజయ్ అక్కడికి రావాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఏడాది గడవక ముందే నియోజకవర్గం అద్భుతంగా పురోగమించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.బీజేపీలా దొంగ లెక్కలు, అబద్దాలు చెప్పే పార్టీ తమది కాదన్నారు. హుజుర్నగర్ ఉప ఎన్నికలో బీజేపీకి వచ్చింది కేవలం 2600 ఓట్లు మాత్రమే. దుబ్బాక ఉప ఎన్నికలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పష్టం చేశారు.