నివర్ తుఫాను ప్రభావంతో రవాణా వ్యవస్థలు బంద్...
By: chandrasekar Wed, 25 Nov 2020 8:01 PM
తమిళనాడులో నివర్ తుఫాను ప్రభావంతో పలు ప్రజా రవాణా
వ్యవస్థలు బంద్ అయ్యాయి. చెన్నైలోని మూడు ఓడరేవులను మూసివేశారు. అలాగే ఏడు
జిల్లాల పరిధిలో బస్సు సర్వీసులను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల
నేపథ్యంలో విమానాలన్నీ రద్దయ్యాయి. టీవీఎం డివిజన్ పరిధిలో ఆరు రైలు సర్వీసులను
నిలిపివేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది.
కరైకాల్, మహాబలిపురం
వద్ద ఇవాళ సాయంత్రం వరకు తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్
సహా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణకేంద్రం పేర్కొంది. తుఫాను ప్రభావంతో
ఇప్పటికే చెన్నైలో భారీ వర్షం కురింది. కంచీపురంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురవడం
ప్రారంభమైంది. దీంతో తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిల్లో ప్రభుత్వాలు హై అలర్ట్ను
ప్రకటించాయి. భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటికే
ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం సైతం రాష్ట్రంలో హైఅలర్ట్
ప్రకటించింది. తీరం వెంట చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
రద్దు చేసిన ట్రైన్లు
చెన్నైలో తుఫాను కారణంగా
టీవీఎం డివిజన్ పరిధిలో ట్రైన్లను రద్దు చేశారు. కన్యాకుమారి - చెన్నై ఎగ్మోర్
డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పెషల్ (రైలు నెం .02634) చెన్నై ఎగ్మోర్ - కన్యాకుమారి డైలీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పెషల్ (02633), కొల్లం-చెన్నై ఎగ్మోర్ డైలీ (అనంతపురి-06724),
చెన్నై ఎగ్మోర్ - కొల్లం డైలీ (అనంతపురి-06723 ) ఎక్స్ప్రెస్ స్పెషల్, కొల్లం - చెన్నై ఎగ్మోర్ వయా మధురై ఎక్స్ప్రెస్
స్పెషల్ (06102), మధురై జంక్షన్ - చెన్నై ఎగ్మోర్ - కొల్లం ఎక్స్ప్రెస్
స్పెషల్ ట్రైన్లను రద్దు చేసింది. రద్దు చేసిన ట్రైన్లకు సంబంధించి టికెట్
డబ్బులు రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది.