ఏపీలో రోజుకో మలుపు తిరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం...
By: chandrasekar Wed, 18 Nov 2020 1:15 PM
ఏపీలో స్థానిక సంస్థల
ఎన్నికలపై మరో ట్విస్ట్ ఎదురైంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం
సిద్ధమైంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం అన్ని జిల్లాల
యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎస్
నీలం సాహ్నీ నిమ్మగడ్డకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని..
పోలీసులు, జిల్లా
యంత్రాంగం కరోనా వ్యప్తి అదుపు చేసే విధుల్లో ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ
సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదని.. గ్రామీణ ప్రాంతాల్లో
యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నాయి అన్నారు. నేటి జిల్లా యంత్రాంగాలతో ఎస్ఈసీ వీడియో
కాన్ఫరెన్స్ అవసరం లేదన్నారు. సీఎస్ రాసిన లేఖపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో
చూడాలి.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక
సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్
కుమార్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ
పక్షాలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో కరోనా
ఉధృతి కూడా తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి
పడిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది
సాధ్యమైందన్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల
నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని ఎస్ఈసీ అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో
లేదని, ఎలక్షన్స్కు
4 వారాల
ముందు కోడ్ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, రాజకీయ
పక్షాలు, అధికారులంతా
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్
సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు
జరుపుతున్నామని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు
నిర్వహిస్తామని అన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రాష్ట్ర
ప్రభుత్వంతో చర్చించిన తర్వాత వెలువరిస్తామన్నారు. ఇటు నేడు గవర్నర్ హరిచందన్తోనూ
నిమ్మగడ్డ భేటీకానున్నారు. ఎన్నికల అంశంపై చర్చించనున్నారు.