బీఎస్ఎఫ్ జవాన్లు వీరమరణం: కుటుంబంతో చివరగా మహేష్ ఎప్పుడు మాట్లాడారంటే...!
By: Anji Mon, 09 Nov 2020 11:02 AM
జమ్ముకశ్మీర్లో భారత భద్రతా దళాలకు, టెర్రరిస్ట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరు ఉండగా.. వారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ ఒకరు. ఈ కాల్పుల్లో మొదట అతడు తీవ్రంగా గాయపడ్డట్లు ఆర్మీ అధికారులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఆ తరువాత వీరమరణం పొందినట్లు వెల్లడించారు.
కాగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కోమన్పల్లికి చెందిన మహేష్.. చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలని కలలు కన్నారు. దీంతో కష్టపడి చదివి పోటీ పరీక్షల్లోనూ పాస్ అయ్యారు.
ఇక ఏడాది క్రితం హైదరాబాద్కి చెందిన ఆర్మీ కమాండర్ కుమార్తె సుహాసినిని మహేష్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 8 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన మహేష్.. తిరిగి వెళ్లి, జమ్ము కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఇక ఈ నెల 2న తోటి జవాన్లతో కలిసి పెట్రోలింగ్కి వెళ్తున్నానని.. వచ్చాక ఫోన్ చేస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే అవే చివరి మాటలు అయ్యాయని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.