ప్రధాని మోడీతో భేటీ అయిన తెలంగాణ సీఎం కెసిఆర్
By: Sankar Sun, 13 Dec 2020 07:27 AM
భారత ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం కెసిఆర్ భేటీ అయ్యారు ..దాదాపు ఏడాది తర్వాత కెసిఆర్ ప్రధానిని కలిశారు...అయితే గత కొంత కాలంగా తెలంగాణాలో పరిస్థితులు బీజేపీ అనుకూలంగా మారుతున్నాయి ..ఇప్పటికే తెరాస కు ఎంతో ముక్యమైన దుబ్బాక లో ఘనవిజయం సాధించిన బీజేపీ , జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా తన సత్తా చాటింది ..ఇలాంటి పరిస్థితులలో సీఎం కెసిఆర్ మోడీతో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది...
దాదాపు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, రాజకీయపరమైన అంశాలపైనా ఇరువురూ చర్చించి ఉండొచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయంగా ఎలాంటి చర్చ జరిగిందనే విషయం తెలియకపోయినా.. ఇటీవలి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య రగిలిన వేడిని చల్లార్చడానికి ఈ భేటీ ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నాయి.
తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని కేసీఆర్ తెలిపారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్ల సాయాన్ని అందించాలని ఇదివరకే ప్రధానికి లేఖ రాసిన సంగతిని గుర్తు చేశారు. జాతీయ విపత్తు నిధి నుంచి నిధులు విడుదల చేసి సాయం చేయాలని కోరారు.