Advertisement

  • కరీంనగర్ లో ఘరానా మోసగాడు ..ఉద్యోగాలు ఇప్పిస్తా అని 4 కోట్లకు బురిడీ

కరీంనగర్ లో ఘరానా మోసగాడు ..ఉద్యోగాలు ఇప్పిస్తా అని 4 కోట్లకు బురిడీ

By: Sankar Thu, 03 Sept 2020 10:30 AM

కరీంనగర్ లో ఘరానా మోసగాడు ..ఉద్యోగాలు ఇప్పిస్తా అని 4 కోట్లకు బురిడీ


ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడిని బుధవారం కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్‌లో హాల్‌లో కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌ గ్రామానికి చెందిన దోమల రమేశ్‌(30)ని కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

హుజురాబాద్‌లోని డీసీఎంఎస్‌ కాంప్లెక్స్‌లో సివిల్‌ పంచాయతీలు పరిష్కరించే కార్యాలయం తెరిచాడు. జిల్లా సివిల్‌ కోర్టు విజిలెన్స్‌ అధికారిగా తనను వరంగల్‌ జిల్లా జడ్జి నియమించినట్లు ఉత్తర్వులు సృష్టించుకొని అమాయలను బురిడికొట్టించాడు. స్కూల్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు నకిలీ అర్డర్లు సృష్టించి విద్యాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వివిధ న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేస్తున్నాడు. అందరిని నమ్మించేందుకు రెండు కార్లు కొని వాటికి జ్యుడిషియల్‌ శాఖకు చెందిన స్టిక్కర్లు అతికించి డిస్ట్రిక్‌ సివిల్‌ కోర్టు జ్యుడిషియల్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా, సౌత్‌సెంట్రల్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా తిరుగుతున్నాడు.

జల్సాలకు అలవాటుపడ్డ రమేశ్‌ పలువురి వద్ద నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు కైత రాంచంద్రంను పరిచయం చేసుకొని అతడి కొడుకుకు జీహెచ్‌ఎంసీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, రాంచంద్రం స్నేహితుడు దశరథం బంధువుకు విద్యుత్‌శాఖలో ఉద్యోగం, వారి బంధువుల్లో మరొక మహిళకు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేశాడు. రాంచంద్రం వద్ద అప్పు రూపంలో మొత్తం సుమారుగా రూ.4 కోట్ల వరకు తీసుకొని మోసం చేశాడు. అతడి వద్ద అప్పు తీసుకునే క్రమంలో రామగుండంలో అతడికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఉన్నట్లు రామగుండం తహసీల్దార్‌ పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృషించి నమ్మించాడు.

దోమల రమేశ్‌ ఆగడాల గురించి సమాచారమందుకున్న కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ బుధవారం ఉదయం హుజురాబాద్‌లో పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. అతడిని విచారించగా మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుత సమాచారంతో ఎల్‌ఎండీ, హుజురాబాద్, గోదావరిఖని వన్‌టౌన్‌లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం నాలుగు రోజుల కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిపారు. రమేశ్‌వల్ల నష్టపోతే కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు లేదా సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు


Tags :
|
|
|

Advertisement