టీడీపీ మరియు వైసీపీ మధ్య తారా స్థాయికి చేరిన పొలిటికల్ వార్
By: chandrasekar Sat, 26 Sept 2020 09:07 AM
ఆంధ్ర రాష్ట్రంలో
తెలుగుదేసం పార్టీ మరియు వైస్సార్ కాంగ్రెస్ కు మధ్య పొలిటికల్ వార్ తారా స్థాయికి
చేరినట్లు తెలుస్తుంది. నిన్నటి దాక తిరుమలలో డిక్లరేషన్ చుట్టూ సాగిన వాదనలు, విమర్శల
వేడి చల్లారక ముందే మరో అంశం తెరమీదకు వచ్చింది. గుంటూరులో దళిత శ్మశాన వాటిక
ధ్వంసంపై టీడీపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ అంశంపై ఏపీ టీడీపీ
అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు జగన్ సర్కార్ పై తీవ్ర వాఖ్యలు చేశారు.
గుంటూరులో జిల్లాలోని
చిలకలూరిపేట దళిత స్మశాన వాటికలో 171 సమాదులను శ్మశాన వాటిక ఆధునీకరణ పేరుతో తొలగించడం
దుర్మార్గమన్నారు. దళితుల అంగీకారం, అనుమతి లేకుండా శ్మశాన వాటికలో ఏ విధంగా పనులు మొదలు
పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా
బాధ్యతలు చేపట్టిన 16 నెలల్లో రోజుకో చోట దళితులపై దాడులు జరుగుతున్నాయని
ధ్వజమెత్తారు. దళితుల మనోభావాలను అగౌరవ పరిచేలా, అవమాన పరిచేలా ప్రభుత్వం
వ్యవహరిస్తుందని విమర్శలు గుప్పించారు. దళిత వ్యతిరేక ముఖ్యమంత్రిగా జగన్మోహన్
రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
ఈ సంఘటనపై విధ్వంసకర
పాలనకు కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చరని కళా వెంకటరావు తీవ్ర వాఖ్యలు
చేశారు. చిలకలూరిపేటలో దళిత శ్మశాన వాటికలో జరిగిన విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ
సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారి ఆధ్వర్యంలో నిజ
నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు
పిల్లి మాణిక్యాల రావు, మానుకొండ శివ ప్రసాద్, దేవతోటి నాగరాజు ఉంటారని
చెప్పారు. ఇప్పటికే ఆలయాలపై దాడులు, తిరుమలలో డిక్లరేషన్ చుట్టూ వాడీవేడిగా ఏపీ రాజకీయం
సాగుతోంది.
రాష్ట్రంలో వైసీపీ
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయని టీడీపీ నేతలు
ఆరోపిస్తున్నారు. పోలీసులను రక్షణగా పెట్టి ఆలయాలను కూల్చిన చరిత్ర టీడీపీదని
వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ అంశంపై విమర్శలు, ప్రతి
విమర్శలు ఇంకా కొనసాగుతుండగానే గుంటూరులో జిల్లాలో జరిగిన దళిత శ్మశాన వాటిక
ధ్వంసం అంశాన్ని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఘటనపై నిజాలు తేల్చేందుకు కమిటీ
ఏర్పాటు చేసింది. దీంతో మరో సారి ఇరు పార్టీల నడుమ మరో సారి విమర్శలు, ప్రతి
విమర్శలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తరచు ఇలా ఇరుపార్టీలు గొడవపడడంతో వ్యతిరేకత మరింత
అధికమైనట్లుంది.