కరోనా తో మృతి చెందిన వ్యక్తుల నుండి ఆభరణాలు దోచేసిన స్విమ్స్ హాస్పిటల్ సిబ్బంది
By: chandrasekar Fri, 25 Sept 2020 08:45 AM
ఇప్పుడు దేశంలో
హాస్పిటల్స్ దోపిడీకి నిలయంగా మారింది. కరోనా తో మృతి చెందిన వ్యక్తుల నుండి
ఆభరణాలు దోచేసిన సంఘటన తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి ఒంటిపై సొత్తులకు భద్రత
లేకుండా పోతోంది. ఏకంగా హాస్పిటళ్ల వార్డుల్లోనే సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ
అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోయిన శవాల వద్ద బంగారు ఆభరణాలు, సెల్
ఫోన్లు మాయం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో
చోటు చేసుకుంది. మృత దేహాం నుంచి బంగారు ఉంగరాలు సెల్ ఫోన్ను దొంగిలించారు. ఈ
తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తిరుపతి స్విమ్స్లో జరుగుతున్న
అకృత్యాలు చూసి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 10 రోజుల
క్రితం తిరుపతి స్విమ్స్లో కరోనా బారిన పడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం
చౌడేపల్లెకి చెందిన వెంకటరత్నం నాయుడు అనే వ్యక్తి చేరారు.
కరోనా వల్ల ఆరోగ్యం
క్షీణించడంతో వెంకటరత్నం బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆ వ్యక్తి మృతి చెందడంతో
మృతదేహాన్ని చూడ్డానికి వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులకు అతని ఒంటిపై బంగారు
ఆభరణాలు కనిపించలేదు. తన తండ్రి చేతికి, ఒంటిపై బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆయన కొడుకు మహేష్
ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. కానీ స్విమ్స్ సెక్యూరిటీ
అధికారులు పట్టించుకోలేదని తెలిపారు.
ఇందుకోసం సీసీటీవీ రికార్డింగ్ లను పరిశీలించడం జరిగింది. చివరికి మృతుని చేతికి ఉంగరాలు ఉండడం
సీసీటీవీలో రికార్డ్ అయింది. అంతేకాక, అతని ఒంటిపై ఆభరణాలు సిబ్బందే దోచేయడం సీసీటీవీ
కెమెరాలో రికార్డు అవడంతో మొత్తం బండారం బయటపడింది. కనీసం వీళ్లకు కనికరం కూడా
లేకుండా మృతి చెందిన వ్యక్తుల నుండి ఇలా దోపిడీ చేయడం చూస్తే ఎంత నీచ స్థితికి
దిగజారారో తెలుస్తుంది. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసికోవాలని ప్రజలు
కోరుతున్నారు.