పితృత్వ సెలవులు అడిగిన అన్న వార్తలో నిజం లేదు ...సునీల్ గవాస్కర్
By: Sankar Mon, 30 Nov 2020 6:05 PM
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ , తన భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ బిడ్డకు జన్మనివ్వనున్న సందర్భంగా టూర్ మధ్యలోనే ఇండియా రానున్న విషయం తెలిసిందే..దీనితో కొంత మంది అభిమానులు కోహ్లీకి మద్దతుగా నిలిస్తే మరికొంతమంది మాత్రం కోహ్లీ మీద విమర్శలు చేసారు..ఇదే సమయంలో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా తాను ఆడే రోజుల్లో పితృత్వ సెలవులు అడిగాడు అని అయితే అతనికి మంజూరు చేయలేదు అని వార్తలు వచ్చాయి...
అయితే దీనిపై గవాస్కర్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలో కొంత నిజం ఉంది కానీ తాను పితృత్వ సెలవు అడగటం మాత్రం నిజం కాదని సన్నీ అంటున్నాడు. నేను న్యూజిలాండ్, వెస్టిండీస్ టూర్ల కోసం బయలుదేరినప్పుడు నా భార్య ఏ సమయంలో అయినా బిడ్డకు జన్మనివ్వనుందన్న విషయం నాకు తెలుసు. అయినా నేను టీమ్కు ఆడటానికే ప్రాధాన్యం ఇచ్చాను అని గవాస్కర్ చెప్పాడు.
అయితే న్యూజిలాండ్తో మూడో టెస్ట్లో అతడు గాయపడ్డాడు. కొన్ని వారాల విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు. వెస్టిండీస్ టూర్కు మధ్యలో మూడు వారాల సమయం ఉండటంతో ఆ లోపు ఇండియాకు వెళ్లి, తొలి టెస్ట్కు ముందే నేరుగా విండీస్లో టీమ్తో చేరతానని తాను అడిగినట్లు సన్నీ చెప్పాడు. అయితే అప్పటి టీమ్ మేనేజర్ పాలీ ఉమ్రిగర్ అందుకు ఒప్పుకోలేదని అతనన్నాడు. దీంతో తాను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా తొలి టెస్ట్లో ఆడిన విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశాడు.