జూన్ 11 వ తేదీ నుంచి భక్తులందరికీ శ్రీవారి దర్శనం
By: chandrasekar Sat, 06 June 2020 12:03 PM
తిరుమల ఉద్యోగులతోనే
శ్రీవారి దర్శనాల ప్రక్రియ ప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి
దర్శనాలు ప్రారంభిస్తామన్నారు. జూన్ 8,
9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు దర్శనం చేసుకుంటారని
చెప్పారు. ఈ నెల 11 నుంచి భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పిస్తామని
వెల్లడించారు.
భక్తులంతా మాస్కులు
ధరించి, భౌతిక
దూరం పాటించాలని చెప్పారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దని
విజ్ఞప్తి చేశారు. 65 ఏండ్లకు పైబడినవారు, పిల్లలకు దర్శనాలు ఉండవని
ప్రకటించారు. సుమారు మూడువేల మందికి ఆన్లైన్ ద్వారా దర్శనం కల్పిస్తామని
చెప్పారు. ఆన్లైన్లో టికెట్ బుక్చేసుకున్నప్పటికీ అలిపిరిలో తనిఖీలు
చేస్తామన్నారు. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శన సౌకర్యం
కల్పిస్తామని అన్నారు.
ఉదయం 6 నుంచి
సాయంత్రం 4 గంటల వరకు అలిపిరి నడకదారిలో అనుమతిస్తామని, శ్రీవారి
పుష్కరిణిలో భక్తుల స్నానాలకు అనుమతిలేదని చెప్పారు. వైరస్ ప్రబలే అవకాశం ఉండటంతో
శఠారి, తీర్థం
ఇవ్వడంలేదని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, గంటకు 500
మందికి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్
సింఘాల్ చెప్పారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న లడ్డూల విక్రయం ఈ నెల 8 నుంచి
నిలిపివేస్తామని అన్నారు. ఈ నెల 11 నుంచి ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 వరకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయన్నారు.
శ్రీవారి మెట్ల మార్గంలో
తాత్కాలికంగా అనుమతి రద్దుచేశామని చెప్పారు. అలిపిరి నుంచి మాత్రమే భక్తులకు
కాలినడకన అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 వరకు కనుమ దారుల్లో, ఉదయం 6 నుంచి
సాయంత్రం 4 వరకు అలిపిరి నడకదారిలో అనుమతిస్తామని వెల్లడించారు.
వసతి గృహాల్లో భక్తులు ఒక్కరోజు మాత్రమే ఉండటానికి అనుమతిస్తామని, క్యూలైన్లలో
ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటైజేషన్ చేస్తామన్నారు. శ్రీవారి హుండీ వద్దకు వెళ్లేవారికి
హెర్బల్ శానిటైజేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల
దర్శనం ఉండదని అన్నారు. 500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తామన్నారు.
ప్రతి రెండు గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లు మారుస్తామన్నారు.