డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారాన్ని ప్రేరేపించేవి: కమలా హ్యారిస్
By: chandrasekar Thu, 20 Aug 2020 5:46 PM
భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ను అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ తరఫున ఉపాధ్యక్ష
అభ్యర్థిగా బుధవారం అధికారికంగా పార్టీ ప్రకటించింది.
ఆమె దాఖలుచేసిన నామినేషన్ను ఆమోదించడంతో అమెరికాలోని అతిపెద్ద పార్టీ తరఫున అధ్యక్ష
ఎన్నికల్లో పోటీచేస్తోన్న తొలి నల్లజాతి మహిళగా కమలా చరిత్ర సృష్టించారు.
తాను, జో బిడెన్ కలిసి మహమ్మారితో నాశనమైన దేశాన్ని పునరుజ్జీవింపజేసి, జాతి,
పక్షపాత ధోరణితో రెండుగా విభజితమైన అమెరికాను ఒక్కటిగా చేస్తామని హామీ ఇచ్చారు. వర్చువల్
డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ మూడో సమావేశంలో పాల్గొన్న కమలా హ్యారిస్ జీవ శాస్త్రవేత్త,
తన తల్లి శ్యామల గోపాలన్ పాఠాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమలా మాట్లాడుతూ దేశం
ఓ గొప్ప సమాజమనే భావన, విజన్ను తన తల్లి నుంచి నేర్చుకున్నానని అన్నారు.
మనం ఎక్కడ నుంచి వచ్చాం, ఎలా ఉన్నా, ఎవరిని ప్రేమిస్తున్నామనే బేధం లేకుండా
అందరికీ ఈ దేశం స్వాగతం పలుకుతుంది’ అని అన్నారు. 1960 నాటి పౌర హక్కుల ఉద్యమం సమయంలో
తన తల్లిదండ్రులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని తెలియజేశారు. ఆక్లాండ్
కైజర్ హాస్పిటల్లో తాను పుట్టిన విషయాన్ని ఆమె ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.
తన అర్హత గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారాన్ని
ప్రేరేపించేవిగా ఉన్నాయని హ్యారిస్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, జాత్యహంకారానికి వ్యాక్సిన్
లేదు, దానిపై మేము పని చేయాల్సి ఉందని కమలా ఉద్ఘాటించారు. జాతిపరంగా భిన్నమైన వర్గాలను
ఏకతాటిపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నిస్తానని కమలా హ్యారీస్ హామీ ఇచ్చారు. కన్వెన్షన్లో
వైస్-ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిచయం
చేశారు. బిడెన్కు హ్యారిస్ ఆదర్శ రాజకీయ భాగస్వామి అని ఒబామా అన్నారు.