సచివాలయ కూల్చివేత పనుల కవరేజీకి కేసీఆర్ సర్కారు మీడియా సంస్థలకు అనుమతి
By: chandrasekar Mon, 27 July 2020 10:40 PM
తెలంగాణ సచివాలయ
కూల్చివేత పనుల కవరేజీకి కేసీఆర్ సర్కారు మీడియా సంస్థలకు అనుమతి ఇచ్చింది.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల బృందం
బీఆర్కే భవన్ నుంచి కవరేజీకి అనుమతి ఇవ్వనున్నారు. ఎత్తయిన భవనాల కూల్చివేత
సందర్భంగా శిథిలాలు పడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మీడియా కవరేజీకి అనుమతి ఇవ్వలేదు.
కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ మీడియా హైకోర్టును ఆశ్రయించింది.
మిగతా మీడియా సంస్థలు
కూడా కవరేజీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం
సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు 90 శాతం
పూర్తయ్యాయి. పది బ్లాకుల కూల్చివేత సందర్భంగా భారీ ఎత్తున వ్యర్థాలు పోగయ్యాయి.
మొత్తం 4500
ట్రక్కులకు సరిపడే వ్యర్థాలు పోగవుతాయని అంచనా. కాగా ఇప్పటికే 2000
ట్రక్కుల వ్యర్థాలను సచివాలయ ప్రాంగణం నుంచి నగర శివార్లకు తరలించారు. తెలంగాణ
సచివాలయ భవనాల కూల్చివేత విషయమై సర్కారు అనేక ఆటంకాలను ఎదుర్కొన్న సంగతి
తెలిసిందే.
గత ఏడాది నూతన
సెక్రటేరియట్ భవనానికి శంకుస్థాపన చేయగా కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల
సచివాలయం కూల్చివేత పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కూల్చివేత ప్రక్రియ షురూ చేసిన
తర్వాత కూడా హైకోర్టులో వేసిన పిటిషన్ల కారణంగా చాలా రోజులపాటు నిలిపేయాల్సి
వచ్చింది.