కయ్యానికి కాలు దువ్వుతున పాకిస్తాన్ ..భారత భూభాగాలతో కూడిన పాకిస్తాన్ మ్యాప్ విడుదల
By: Sankar Wed, 05 Aug 2020 09:31 AM
ఇటీవల కాలంలో చైనా అండ చూసుకొని నేపాల్ , పాకిస్తాన్ వంటి మన పొరుగు దేశాలు ఇండియా తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి ..మొన్నటిదాకా నేపాల్ ఎదో ఒక విమర్శలు చేసుకుంటూ ఉండగా ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది ..నేపాల్ లానే పాకిస్తాన్ కూడా భారత భూభాగాలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది ... జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఇండియా ప్రభుత్వం నిర్వీర్యం చేసి బుధవారానికి ఏడాది కానుంది.
అంతకంటే ఒక్కరోజు ముందు మంగళవారం దీన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ కొత్త మ్యాప్నకు పాక్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గుజరాత్లోని జునాగఢ్, మనవదర్, సర్ క్రీక్లను కూడా ఈ పటంలో చేర్చడం గమనార్హం. అంతేకాకుండా నియంత్రణ రేఖను(ఎల్ఎసీ)ని కారాకోరం పాస్ దాకా పొడిగించింది. సియాచిన్ను పూర్తిగా పాక్లో అంతర్భాగంగా మార్చేసింది.
పాక్ ప్రజలతోపాటు కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు సైతం ఈ మ్యాప్ ప్రతిరూపమని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇప్పటినుంచి ఇదే పాకిస్తాన్ అధికారిక పటమని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా బుధవారం ‘బ్లాక్ డే’గా పాటించనున్నట్లు పాకిస్తాన్ పేర్కొంది.
కొత్త మ్యాప్ అంటూ పాకిస్తాన్ సాగిస్తున్న ప్రచారం అసంబద్ధమైన చర్య అని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. పాక్ ఎత్తుగడ హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పాక్ చర్యలకు చట్టబద్ధత గానీ, అంతర్జాతీయ సమాజం నుంచి ఆమోదం గానీ లేవని స్పష్టం చేశారు.