ఆపరేషన్ కోసం పూణే నుంచి హైదరాబాద్ కు 560 కిలోమీటర్లు 80 నిముషాలు..
By: Sankar Mon, 17 Aug 2020 10:13 AM
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన లంగ్స్ ను పూణే నుంచి హైదరాబాద్ వరకు 560 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 80 నిమిషాల్లో చేరుకున్నారు..వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆ వ్యక్తి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులు అవయవదానం చేసి మరో నలుగురి ప్రాణం పోయాలని మానవత్వంతో ముందుకొచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఊపిరితిత్తుల దాత కోసం జీవన్దాన్లో పేరు నమోదు చేసుకున్నాడు.
జీవన్ధాన్ డాక్టర్ స్వర్ణలత, పుణేలో జడ్టీసీసీ సెంట్రల్ కో–ఆర్డినేటర్ ఆర్తిగోఖలే.. పుణే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఊపిరితిత్తులను సేకరించి హైదరాబాద్ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి శస్త్రచికిత్స ద్వారా లంగ్స్ను సేకరించారు. పుణే ఆస్పత్రి నుంచి ఎయిర్పోర్టు వరకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. 11 కిమీ దూరం ఉండే పుణే ఎయిర్పోర్టుకు 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది. అప్పటికే ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉన్న చార్టెడ్ ఫ్లైట్ ఆ ఆర్గాన్స్తో పుణే నుంచి బయలుదేరి 4.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంది.
నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆదేశాల మేరకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వరకు బేగంపేట ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి 2.9 కి.మీ దూరం ఉండే కిమ్స్ ఆసుపత్రికి 2 నిమిషాల 5 సెకన్లలో అంబులెన్స్లో ఆర్గాన్ను చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కిమ్స్ వైద్యుల బృందం ఆర్గాన్ను మరో వ్యక్తికి అమర్చే శస్త్రచికిత్స మొదలెట్టారు. ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి సుమారు 6 నుంచి 8 గంటలు పడుతుందని వైద్యులు చెప్పారు.