అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ... గీతా ఆర్ట్స్లో డిజైనర్ అని...అమ్మాయిలతో చాటింగ్
By: chandrasekar Fri, 10 July 2020 5:48 PM
వెండితెరపై కనిపించాలనే
కోరిక కలిగిన అమాయకపు అమ్మాయిలకు కొంత మంది మోసగాళ్లు వల వేస్తున్నారు. సినిమాల్లో
అవకాశాలు ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. తాను తీయబోయే మల్టీస్టారర్
సినిమాలో రెండో హీరోయిన్గా అవకాశం ఇస్తానని చెప్పి తన పేరిట ఒక నెంబర్ నుంచి కొంత
మంది అమ్మాయిలకు కాల్స్ వెళ్లాయని ఇటీవల RX
100 దర్శకుడు అజయ్ భూపతి హైదరాబాద్ సైబర్ క్రైమ్
పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి వాళ్లను అమ్మాయిలు
నమ్మొద్దని అజయ్ ఒక వీడియో మెసేజ్ను కూడా విడుదల చేశారు. ఈ విషయం మరవకముందే సినిమా
ఇండస్ట్రీ నుంచి ఇలాంటి కేసే మరొకటి నమోదయ్యింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు
చెందిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరుతో ఒక కేటుగాడు అమ్మాయిలకు వల
వేస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన తమిళ్ సినిమాలో హీరోయిన్గా
అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలకు వల విసురుతున్నాడు.
గీతా ఆర్ట్స్లో డిజైనర్, మేకప్మెన్గా
పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాడు. అలా అతని మాటలు
నమ్మి అమ్మాయిలు మోసపోతున్నారు. అయితే, ఈ విషయం గీతా ఆర్ట్స్ దృష్టికి వచ్చింది. దీంతో ఆ
ప్రతిష్టాత్మక సంస్థ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గీతా
ఆర్ట్స్ మేనేజర్ సత్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మంచి
పేరు ప్రఖ్యాతలు ఉన్న తమ బ్యానర్ పేరు చెప్పి అమాయకులైన అమ్మాయిలను మోసం చేస్తున్న
వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సత్య కోరారు.
పోలీసులు కేసు నమోదు
చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గీతా ఆర్ట్స్ ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో
ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ప్రస్తుతం కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’, నిఖిల్
సిద్ధార్థ్తో ‘18 పేజస్’, అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలను
నిర్మిస్తోంది.