నీట్ పరీక్ష ఫలితాలు వాయిదా ...అక్టోబర్ 14 న మరోసారి నీట్
By: Sankar Mon, 12 Oct 2020 4:28 PM
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వాయిదాపడ్డాయి. సెప్టెంబర్ 13 న జరిగిన నీట్ పరీక్షా ఫలితాలు షెడ్యూల్ ప్రకారం నేడు (సోమవారం) విడుదల కావాల్సి ఉండగా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఫలితాలు ఆలస్యం కానున్నాయి.
కరోనా నియంత్రణ చర్యలతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్ 14న ఎగ్జామ్ నిర్వహించాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈమేరకు ఫలితాల విడుదల వాయిదా పడింది.
అక్టోబర్ 16 న ఫలితాలు విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన నీట్ పరీక్షా నిర్వహణ ఎట్టకేలకు సెప్టెంబర్ 13 న జరిగింది. అయితే, దేశవ్యాప్తంగా 15 లక్షల మంది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 90 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.