అంతర్వేది రథం కాలిన ఘటన ఎదో కుట్రలాగా అనిపిస్తుంది..ఎంపీ రఘురామకృష్ణంరాజు
By: Sankar Mon, 07 Sept 2020 2:32 PM
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్టకరమని నరసారపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. అంతర్వేది రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్న ఆయన రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
ఒక మతం పై జరిగిన దాడిలా ప్రజలు భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోరారు. ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగిన ఒక పిచ్చివాడు చేశాడంటూ కేసులు కొట్టేస్తున్నారని ఈసారి అలా కాకుండా విచారణ జరిపించి బాధ్యులెవరైన, ఏ మతస్థులైన కఠినంగా శిక్షించాలని కోరారు. రాబోయేరోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.
కాగా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనపై జిల్లా యంత్రాంగం అంతర్గత విచారణకు ఆదేశించింది. సంఘటనకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జిల్లా అగ్నిమాపక అధికారి రత్నకుమార్, అదనపు ఎస్పీ కరణం కుమార్, అంతర్వేది ఆలయ ఈఓ చక్రధరరావులతో ఈ కమిటీ ఏర్పాటైంది. నాలుగైదు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు