ప్రారంభం అయిన పార్లమెంట్ సమావేశాలు..కరోనా వైరస్ విజృంభణపై మోడీ వ్యాఖ్యలు
By: Sankar Mon, 14 Sept 2020 12:13 PM
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనల నడుమ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం లోక్సభ, మధ్యాహ్నం రాజ్యసభ వేర్వేరు సమయాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత లోక్సభ ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతారణం, దేశంలో కరోనావైరస్ విజృంభణపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. మన సైనికులు మాతృభూమి కోసం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తున్నారని కితాబిచ్చారు.
అలాగే వారికి అండగా నిలబడి ఉన్నామని పార్లమెంట్ కూడా సందేశాన్ని పంపుతుందని విశ్వసిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నా పార్లమెంట్ సభ్యులు విధులకు హాజరు కావడానికి, వారాంతాల్లో కూడా పనిచేయడానికి అంగీకరించడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రావాలని మేం కోరుకుంటున్నామని, మన శాస్త్రవేత్తలు కూడా విజయవంతం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా కరోనా కారణంగా పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు. క్వశ్చన్ అవర్ లేకుండానే చట్టసభలు సమావేశం కావడమే కాదు, జీరో అవర్ను సైతం 30 నిమిషాలకు కుదించారు. అయితే, ప్రశ్నోత్తరాలను రద్దుచేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుందని దుయ్యబడుతున్నాయి. సభ ప్రారంభమైన తర్వాత అయితే, ఈ ఆరోపణలను అధికార పక్షం తోసిపుచ్చింది.