మంగళగిరి నియోజకవర్గం జర్నలిస్టులకూ బీమా అవకాశం కల్పించిన లోకేష్
By: chandrasekar Mon, 20 July 2020 6:21 PM
గుంటూరు జిల్లా మంగళగిరి
నియోజకవర్గం జర్నలిస్టులకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీమా అవకాశం కల్పించారు. మంగళగిరి
నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోని 62 మంది పాత్రికేయులకు
లోకేష్ బీమా చేయించారు. సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదమైతే రూ.20 లక్షలు, కరోనా మరణాలకూ బీమా వర్తింపజేసేలా ప్రీమియం
చెల్లించినట్లు లోకేష్ వెల్లడించారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి
నివారణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో
కరోనా కేసులు పెరుగుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కరోనా వైరస్
విజృంభిస్తున్న వేళ ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఫ్రంట్లైన్ వారియర్స్తోపాటు కలిసి
పనిచేస్తూ కరోనా కోరల్లో చిక్కి రోజుకో జర్నలిస్టు మృత్యువాత పడటంపై లోకేష్
తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని
విన్నవిస్తూనే తనవంతు సాయం చేశారు.
జూలై 15 నుంచి
అమల్లోకి వచ్చిన జర్నలిస్టుల బీమాతో ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబాలకు
ధీమా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ పత్రాలను
ఆయా జర్నలిస్టులకు అందజేయనున్నారు. అలాగే కోవిడ్-19 వైరస్
కల్లోలం రేపుతున్న వేళ.. వైరస్ కట్టడికి ముందుండి పోరాడుతున్న వైద్య, పారిశుధ్య, అత్యవసర
సర్వీసులు అందిస్తున్న వారందరూ కరోనా కాటుకు గురవుతున్నారని లోకేష్ ఆందోళన
వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కట్టడికి కృషి చేస్తున్న
వారితో పాటే జర్నలిస్టులూ విధులు నిర్వర్తిస్తున్నారని అందుకే తన వంతుగా
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు బీమా చేయించానని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ
ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని, పీపీఈ కిట్లు అందజేయాలని, కోవిడ్
బారిన పడిన మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని
లోకేష్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులు కూడా విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా
ఉండాలని లోకేష్ సూచించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని, మీపై
ఆధారపడిన కుటుంబాలకు అన్యాయం చేయొద్దని పిలుపునిచ్చారు. శానిటైజర్ను తమ వెంటే
ఉంచుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వీలైనంత
దూరం పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
కార్యకర్తల కుటుంబాలను
అన్నివిధాలుగా ఆదుకునేందుకు కార్యకర్తల సంక్షేమ విభాగం నెలకొల్పి, దాన్ని
విజయవంతంగా నిర్వహిస్తున్న దేశంలోనే ఏకైక రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి
గుర్తింపు ఉంది. వంద రూపాయల సభ్యత్వం చెల్లించిన టీడీపీ కార్యకర్తకు ప్రమాద
బీమా, గాయపడ్డా
చికిత్స ఖర్చులు చెల్లించేలా సంక్షేమ నిధి నుంచి అందరికీ పాలసీలు చేయించిన ఘనత
ఈ విభాగం కన్వీనర్ నారా లోకేష్దే. దాదాపు 4,529 మందికి రూ. 91 కోట్లు చెల్లించి కార్యకర్తల కుటుంబాలకు ఆసరాగా
నిలిచింది ఈ బీమా పథకం. కార్యకర్తల పిల్లల చదువులకు 2.50
కోట్లు, ఇతర
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తల కుటుంబాలకు రూ. 15
కోట్లు అందించారు. తాజాగా, మంగళగిరి నియోజకవర్గంలోని జర్నలిస్టులకూ
లోకేష్ బీమా అవకాశం కల్పించారు.