ఒక తరం ముగిసింది ..ఎస్పీ బాలు సినీ ప్రస్థానం
By: Sankar Fri, 25 Sept 2020 2:30 PM
ఎస్పీ బాలసుబ్రమణ్యం ..ఏమని చెప్పాలి ఈ పేరు గురించి, ఎలా మొదలు పెట్టాలి ఈ పేరును వర్ణించడానికి .ఒకటా , రెండా దాదాపు నలబై వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు గురించి ఏమని చెప్పాలి ..ఒక్క వ్యక్తి కోసం దేశం మొత్తం ఎందుకు ఇంతలా ప్రార్ధనలు చేస్తుంది...ఒక వ్యక్తి కరోనా తో హాస్పిటల్ లో పోరాడుతుంటే ఎందుకు దేశం మొత్తం తల్లడిల్లింది.. ఒక వ్యక్తి మరణం ఎందుకు ఇంతలా బాధిస్తుంది అంటే ఒకే ఒక్క సమాధానం ఆయన గాత్రం ...దేశంలో ఎంతో మంది గాయకులూ వచ్చారు వెళ్లారు , వస్తారు కూడా కానీ మరొక ఎస్పీ బాలు మాత్రం ఎప్పటికి రాలేడు..ఎన్టీఆర్ సినిమాకు పాట పడితే ఎన్టీఆర్ గొంతు , ఏఎన్ఆర్ కు పాడితే ఏఎన్ఆర్ లాగ , మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మెగాస్టార్ లాగ ఇలా సినిమా ఎవరిదీ అయితే వారి గొంతులోకి పరకాయ ప్రవేశం చేయడం ఇండియన్ సినిమా చరిత్రలో బహుశా ఎస్పీబీ కి ఒక్కడికే సాధ్యం అయింది..
ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతుల రెండో సంతానం. ఇంజనీర్ కావాలని కలలు కని గాయకుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్న ఆయన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంలోతొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దుజే కేలియే' లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగినసినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు.
పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి భారత అత్యున్నత పురస్కారాలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలను లెక్కలేనన్ని అందుకున్న బాలు.. ఎన్నో నేషనల్ అవార్డులు, నంది అవార్డులు బాలు సొంతం చేసుకున్నారు. 2016లో సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. సుమారు వందకు పైగా సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. కమల్హాసన్, రజనీకాంత్, సల్మాన్ఖాన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ కు గాత్రదానం చేసారు. సుమారు 45 సినిమాల్లో నటనాకౌశలాన్ని బాలు ప్రదర్శించారు. సినిమాల్లో కథానాయకుడిగా, సపోర్టింగ్ యాక్టర్గా నటించిన బాలు..2012లో మిథునం సినిమాలో నటనకుగాను బాలుకు నంది పురస్కారం అందుకున్నారు..
తెలుగులో క్షణం తీరిక లేకుండా సినిమా పాటలు పాడుతున్న సమయంలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలసుబ్రమణ్యం. తొలి హిందీ సినిమా ద్వారా తన సత్తా ఏంటో చాటి చెప్పారు. అప్పటి వరకూ ఓ మూసగా సాగిపోతున్న బాలీవుడ్ పాటలను మరో మలుపు తిప్పారాయన. దేశవ్యాప్తంగా కోట్ల మంది శ్రోతలను అలరించడానికి ఎస్పీ బాలసుబ్రమణ్యానికి బాలీవుడ్ ఓ చక్కటి వేదికగా ఉపయోగపడింది. 1981లో ఏక్ దూజే కే లియే సినిమా ద్వారా తన మధురమైన స్వరాన్ని హిందీవారికి పరిచయం చేశారాయన. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన మరో చరిత్ర హిందీ రీమేకే ఏక్ దూజే కే లియే. ఇందులో కూడా కమల్ హాసనే హీరో. రొమాంటిక్ సాంగ్స్ అద్భుతంగా పాడారు. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించాయి.
ఎంట్రీతోనే హిందీలో తన మార్క్ చాటుకున్న బాలసుబ్రమణ్యానికి ఏక్ దూజే కే లియే చిత్రం జాతీయ ఉత్తమ నేపధ్య గాయకుడిగా అవార్డు తెచ్చిపెట్టింది. అటు నుంచి ఎస్పీ వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నా.. హిందీ పాటలకు కూడా సమయం కేటాయించక తప్పలేదు. క్రమంగా బాలీవుడ్లోనూ తీరిక లేకుండా ఆయన ప్రయాణం సాగింది. దాంతో పదేళ్లు వెనుతిరిగి చూడలేదు. ముఖ్యంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఎస్పీబీ గాత్రం.. ఆ సినిమాల విజయానికి కారణమయ్యాయి. సల్మాక్ కెరీర్లో సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ మైనే ప్యార్ కియాలో అద్భుతమైన పాటలు పాడారు బాలు. ఈ సినిమాలో ఎస్పీ పాడిన రొమాంటిక్ సాంగ్స్ ఇప్పటికీ లవర్స్ దిల్ దివానా అంటూనే ఉంటుంది.