తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కెసిఆర్ శుభవార్త
By: chandrasekar Sat, 24 Oct 2020 09:20 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులకు కెసిఆర్ శుభవార్త తెలిపారు. రాష్ట్ర వివిధ శాఖల్లో పనిచేస్తున్న
ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచుతూ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జులై
నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి
ఆదేశించారు. ఉద్యోగులకు 5.25 శాతం మేర డీఏని పెంచినట్లు కేసీఆర్ తెలిపారు. దీంతో
డీఏ ప్రస్తుతం ఉన్న 33.53 శాతం నుంచి 38.77 శాతానికి పెరిగింది.
ప్రస్తుతం బేసిక్ శాలరీ
(మూల వేతనం)పై పెరిగిన డీఏ 2019 జులై 1 నుంచే అమల్లోకి రానుంది. దసరా పండుగ శుభ సందర్భంగా
దసరా మరుసటి రోజైన అక్టోబర్ 26వ తేదీన కూడా సెలవుగా ప్రకటిస్తూ సీఎం కేసీఆర్
నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఇకపై ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజును సెలవు రోజుగా
ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు
తెలంగాణలో దసరా సెలవును అక్టోబర్ 26కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా
రాష్ట్రంలో ప్రతి ఏటా దసరా రోజున మాత్రమే సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటిస్తూ
వస్తోంది. ఈ విషయంలో మార్పులు తీసుకొస్తూ ఇకపై దసరా పండగ మరుసటి రోజును కూడా సెలవు
రోజుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.