ఎమ్యెల్యే ల ప్రవర్తనపై హెచ్చరించిన బీజేపీ పార్టీ చీఫ్ జెపి నడ్డా
By: Sankar Mon, 19 Oct 2020 12:29 PM
గత వారం ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అనుచరుడు ఒకరు బల్లియాలో పోలీసుల ఎదుటే ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సురేంద్ర సింగ్ తన అనుచరుడికి మద్దతివ్వడం పట్ల తీవ్ర దుమారం రేగింది. దాంతో పార్టీ అధిష్టానం చర్యలకు పూనుకుంది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా సురేంద్ర సింగ్కి నోటీసుల జారీ చేసింది.
అంతేకాక ఎమ్మెల్యే ప్రవర్తనపై యూపీ పార్టీ చీఫ్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హెచ్చిరించినట్లు సమాచారం. సురేంద్ర సింగ్ అనుచరుడు ధీరేంద్ర సింగ్ పంచాయతీ సమావేశంలో జై ప్రకాష్ అనే గ్రామస్తుడిపై కాల్పులు జరిపాడు. దాంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాల్పుల సమయంలో అధికారులు, పోలీసులు అక్కడే ఉండటం గమనార్హం..
ఈ ఘటన అనంతరం ధీరేంద్ర సింగ్ పరారయ్యాడు. నిన్న ఒక హైవేపై పట్టుబడ్డాడు. దాంతో లొంగిపోతానని కోరడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి సురేంద్ర సింగ్ తన అనుచరుడు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపాడని తెలిపారు. పోలీసులు, అధికారులు ఏకపక్షంగా విచారణ జరపుతున్నారంటూ మండి పడ్డాడు.