చైనా పరికరాలు వాడొద్దని కేంద్ర టెలికాం శాఖ ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం
By: chandrasekar Fri, 19 June 2020 12:15 PM
బీఎస్ఎన్ఎల్ 4జీ అప్గ్రేట్ పనుల్లో చైనా కంపెనీలకు సంబంధించిన
పరికరాలు వాడొద్దని కేంద్ర టెలికాం శాఖ ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఇందుకోసం అవసరమైతే కొత్తగా టెండర్లు పిలవాలని కోరినట్టు సమాచారం. బీఎస్ఎన్ఎల్తో పాటు
ఎంటీఎన్ఎల్కు కూడా ఇదే రకమైన సమాచారం ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
బీఎస్ఎన్ఎల్తో పాటు
ప్రైవేటు టెలికాం కంపెనీలు సైతం చైనా పరికరాలపై ఆధారపడే ప్రక్రియను సాధ్యమైనంత
తొందరగా తగ్గించుకోవాలని చెప్పేందుకు టెలికాం శాఖ సిద్ధమైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
చైనా కంపెనీలు తయారు చేసిన ఈ పరికరాల ద్వారా నెట్ వర్క్ సెక్యూరిటీ విషయంలో
ఇబ్బందులు రావొచ్చనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది.
లద్దాఖ్లోని గాల్వన్
లోయలో ఇండియా చైనా సైనికుల మధ్య గొడవలు జరిగి 20 మంది
భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు
తెలుస్తోంది.
చైనా దుశ్చర్య కారణంగా
ఇప్పటికే భారత్లో చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్ పెరుగుతోంది.
చైనా ఉత్పత్తులను
బహిష్కరించాలనే ఆందోళనలు పెరగడంతో చైనాకు చెందిన ఒప్పో కంపెనీ తమ 5జీ ఫోన్ లాంఛింగ్ను వాయిదా వేసింది. షియోమీ, వివో, రియల్మీ, ఒప్పో వంటి చైనా మొబైల్ కంపెనీలు భారత్ స్మార్ట్
ఫోన్ల విభాగంలో దాదాపు 76 శాతం
వాటాలు కలిగి ఉన్నాయి.