అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం జులై 15 వరకు పొడిగింపు
By: Sankar Fri, 26 June 2020 7:01 PM
అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కార్గో సర్వీసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని డీజీసీఏ స్పష్టం చేసింది.
కాగా, మార్చి చివరి వారంలో కరోనా లాక్డౌన్ విధించడానికి కొద్ది రోజుల ముందే అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే మే 25 నుంచి పలు రూట్లలో దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం అనుమతించింది. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం నిషేధాన్ని కొనసాగించారు.
కొద్ది రోజుల కిందట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్.. కరోనా కేసుల సంఖ్యను బట్టి జూలై నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతోనే విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకన్నట్టుగా సమాచారం. మరోవైపు లాక్డౌన్తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.