హాట్ కేకుల్లాగా సేల్ అయిన ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ టికెట్లు
By: Sankar Fri, 20 Nov 2020 6:54 PM
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల మ్యాచ్ల టికెట్లన్నీ అమ్ముడైపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం తెలిపింది. రెండు రోజులుగా ఈ మ్యాచ్ల కోసం టికెట్లను అమ్ముతున్నారు.
సిడ్నీలో జరిగే మూడు టీ20లు, కాన్బెర్రాలో జరిగే మూడు వన్డేలు కలిపి ప్రస్తుతం కేవలం 2 వేల కంటే తక్కువ టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. అయితే ఈ రెండు స్టేడియాల్లోనూ కొవిడ్ నిబంధనల కారణంగా 50% టికెట్లు మాత్రమే అమ్మకానికి ఉంచారు. దక్షిణాసియా ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియాలో ఇండియా ఎప్పుడు పర్యటనకు వెళ్లినా.. టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి.
ఇండియాతో సిరీస్ అంటేనే క్రికెట్ ఆస్ట్రేలియాపై కాసుల వర్షం కురుస్తోంది. మరోవైపు తొలి టెస్ట్ వేదికైన అడిలైడ్లో పరిస్థితులు కుదుట పడుతున్నాయి. కరోనా కేసులు భారీగా వస్తుండటంతో ఇక్కడి అధికారులు బుధవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధించారు.
దీంతో తొలి టెస్ట్ ఇక్కడ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే తప్పుడు సమాచారంతో తాము ఈ లాక్డౌన్ విధించామని, త్వరలోనే దానిని ఎత్తేయనున్నట్లు అక్కడి అధికారులు చెప్పారు. దీంతో తొలి టెస్ట్ షెడ్యూల్ ప్రకారం అడిలైడ్లోనే జరగనుంది.