'గూగుల్ ఫొటోస్' లో 15 జీబీ దాటితే ఇక పై చార్జీలు...
By: chandrasekar Fri, 13 Nov 2020 12:57 PM
అన్ని సందర్భాల్లో ఇప్పుడు
ఫొటోలు తప్పనిసరి అయ్యాయి. తీసిన ఫొటోలన్నీ ఫోన్లో అలాగే దాచేయడం కుదరదు. అలాగని
అన్నింటినీ ప్రింట్ తీసుకొని పెట్టుకోలేం. అందుకే గూగుల్ సంస్థ ‘గూగుల్ ఫొటోస్' పేరుతో
ఫొటోలను భద్రపర్చుకొనే వెసులుబాటును కల్పించింది.
ఫోన్తో ఫొటోలు
తీసినప్పుడు అవి ఆటోమేటిక్గా గూగుల్ ఫొటోస్కు వెళ్తాయి. జీమెయిల్తో లాగిన్
అవడం ద్వారా వాటిని ఎక్కడైనా చూసుకోవచ్చు. గూగుల్ సంస్థ దాదాపు ఐదేండ్లుగా ఈ
సేవలను ఉచితంగా అందిస్తున్నది. కానీ ఇకపై గూగుల్ ఫొటోస్ సేవలను ఉచితంగా పొందడం
కుదరదు.
15 జీబీకి మించి ఫొటోలను దాచుకోవాలంటే నిర్దిష్ట
మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని గూగుల్ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి
ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తన అధికారిక బ్లాగులో తెలిపింది.
అయితే జూన్ 1వరకు
అప్లోడ్ చేసిన ఫొటోలు ఈ 15జీబీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. గూగుల్
ఫొటోస్ ఉచితం కావడంతో అందులో డేటా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే 4 లక్షల
కోట్లకు పైగా ఫొటోలు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి.
ప్రతీవారం 2,800 కోట్ల
కొత్త ఫొటోలు వచ్చి చేరుతున్నాయి. దీంతో గూగుల్ సర్వర్లపై విపరీతమైన భారం
పెరుగుతున్నది. సర్వర్లపై భారం తగ్గించేందుకే గూగుల్ చార్జీల నిర్ణయం
తీసుకున్నట్టు సమాచారం.