తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్లో మళ్ళీ భారీ వర్షసూచన
By: chandrasekar Mon, 05 Oct 2020 09:27 AM
తెలంగాణ మరియు ఆంధ్ర
ప్రదేశ్లో మళ్ళీ భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. తెలుగు
రాష్ట్రాలను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ శాతం
వర్షపాతం నమోదయింది. నీటి ప్రవాహంతో నదులన్నీ కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ
నిండు కుండల్లా మారాయి. ఇంత వరకు బాగానే ఉన్నా పలు ప్రాంతాల్లో రైతులు మాత్రం
నష్టపోతున్నారు. రోజుల తరబడి నీళ్లు నిలవడంతో పంటపొలాలు దెబ్బతింటున్నాయి. ఐతే
మరికొన్ని రోజుల పాటు ఈ వాన కష్టాలు తప్పేలా లేవు. రానున్న నాలుగు రోజుల్లో భారీ
వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
ఇంతకు ముందే ఆంధ్ర
రాష్ట్రాలను వర్షాలు బాగా ముంచెత్తాయి. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసర
ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
అంతేకాదు దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం నెలకొంది.
దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం
ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర
ప్రదేశ్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలిపింది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో
కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇది ఒక రకంగా
బాగున్నా మరో రకంగా పంటలు ఎక్కువ రోజులు నీటిలో మునగడం వల్ల నష్టాలూ వచ్చే
అవకాశాలు ఉన్నట్లు రైతులు చెపుతున్నారు.