నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు కొట్టేసిన అక్రమార్కులు
By: Sankar Thu, 20 Aug 2020 08:11 AM
నకిలీ సర్టిఫికెట్స్ విషయంలో హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ సిబ్బంది నిన్న నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే..అయితే ఈ నకిలీ సర్టిఫికెట్స్ ద్వారా పోస్టల్ మరియు రైల్వే శాఖలలో ఉద్యోగాలు పొందినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపారు..
ఆయన చెప్పిన కథనం ప్రకారం..రైల్వేలో సీనియర్గ్రేడ్ ఎలక్ట్రిషియన్గా పనిచేసే మాలోతు మశ్చేందర్ నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నట్టు తేలడంతో మల్కాజిగిరి, గుంటూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. రైల్వేశాఖ సస్పెన్షన్ వేటువేయగా తిరిగి ఉద్యోగంలో చేరాడు. 2018లో తపాలాశాఖలో పోస్టులకు నోటిఫికేషన్ జారీకావడంతో హబ్సిగూడకు చెందిన సంతోష్రెడ్డితో కలిసి నకిలీ సర్టిఫికెట్లు తయారుచేశాడు.
ఎస్ఎస్సీలో మంచి మార్కులు వచ్చిన వారికి మెరిట్ చూసి పోస్టల్శాఖలో ఉద్యోగాలు ఇస్తారని ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షలు వసూలుచేశాడు. నకిలీ సర్టిఫికెట్లతో మీర్జాలగూడకు చెందిన అమ్ముల రాజేశ్కుమార్, పార్సీగుట్టకు చెందిన ఆకుల జయంత్కుమార్, దీపిక పోస్టుమాస్టర్లుగా ఉద్యోగాలు పొందారు. సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం మశ్చేందర్, సంతోష్రెడ్డి, రాజేశ్కుమార్, జయంత్కుమార్ను అరెస్ట్చేశారు.