ట్యూషన్ మాస్టర్ కి కరోనా సోకడంతో విద్యార్థులకు కూడా
By: chandrasekar Fri, 02 Oct 2020 4:12 PM
కరోనా మహమ్మారి కొందరు
నిర్లక్ష్యంగా వ్యవహరించడ౦ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. పాఠశాలలు తెరిస్తే కోవిడ్
మరింత విజృంభించే ప్రమాదముందని భావించే ప్రభుత్వాలు పాఠశాలలు తెరవడానికే
భయపడుతున్న ఈ సమయంలో ఓ వ్యక్తి ప్రైవేటు ట్యూషన్ నిర్వహించాడు. అయితే అతనికే కరోనా
రావడంతో వైరస్ పదుల సంఖ్యలో విద్యార్థులకు సోకింది.
ఈ ఘటన గుంటూరు జిల్లా
సత్తెనపల్లి మండలంలో జరిగింది.
వివరాలలోకి వెళితే...
సత్తెనపల్లి మండలంలోని భట్లురు గ్రామంలో ఓ వ్యక్తి ప్రైవేటు ట్యూషన్ నిర్వహించాడు.
దాదాపు 50 మంది
విద్యార్థులు ఆ ట్యూషన్ కు వస్తున్నారు. అయితే ఆ ట్యూషన్ నిర్వాహకుడికే కరోనా
సోకడ౦తో ట్యూషన్ కు హాజరైన 14 మంది విద్యార్థులకు కరోనా వ్యాపించింది. ఈ మేరకు
జిల్లా అధికారులకు నివేదిక అందింది.
కరోనా సోకిన వారిలో
అత్యధికమంది చిన్నారులు ఏడేళ్ల లోపు వారే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సత్వరమే
స్పందించిన అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా
సోకిన విద్యార్థులను గుంటూరులోని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. కేసులు అధికంగా
నమోదు కావడంతో భట్లూరు ఎస్సీ కాలనీని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.
విద్యార్థులతో కలిపి గ్రామంలో ఒకే రోజు 39 కేసులు నమోదు కావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన
వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే కరోనా నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్ సెంటర్
నిర్వహించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ట్యూషన్లు, పాఠశాలలు నిర్వహించేదుకు ఎలాంటి అనుమతి లేదని
కలెక్టర్ స్పష్టం చేశారు.