సంచలనం రేపిన దిశ దుర్ఘటనకు నేటితో ఏడాది పూర్తి...
By: Sankar Fri, 27 Nov 2020 08:15 AM
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’దుర్ఘటనకు నేటి(గురువారం)తో ఏడాది పూర్తయింది. వైద్యురాలైన దిశను శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి గేటు వద్ద లారీ డ్రైవర్లు, క్లీనర్లు అపహరించి, లైంగికదాడి జరిపి దారుణంగా హతమార్చి, దహనం చేసిన ఘటనపై దేశం భగ్గుమంది.
తర్వాత దిశను దహనం చేసిన షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి బ్రిడ్జి వద్దనే పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించిన సంగతి తెలిసిందే. దిశ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆమె జీవితంలో జరిగిన అత్యంత విషాద క్షణాలను సినిమాగా తీయడంపై ఆమె తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చట్టపరంగా ఆపేందుకు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు.
దిశ తండ్రి శ్రీధర్రెడ్డి 1981 నుంచి 1987 వరకు సైన్యంలో పనిచేశారు. పంజాబ్ కపుర్తలాలోని 12 ఆర్మ్డ్ రెజిమెంట్లో ఆయన విధులు నిర్వహించారు. 1984లో అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. ఈ పోరులో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే రిజర్వ్ ఫోర్స్ కింద 12వ ఆర్మ్డ్ రెజిమెంట్ పనిచేసింది. నేరుగా యుద్ధక్షేత్రంలోకి వెళ్లకపోయినా ఆ క్షణంలో అవసరమైతే ప్రాణాలర్పించేందుకు ఈ రెజిమెంట్ సిద్ధమైంది. అలాంటి తనకు ఈ సమాజం ఏమిచ్చిందని శ్రీధర్రెడ్డి వాపోయారు