వాహనదారులు జాగ్రత్త..బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు
By: Sankar Sun, 04 Oct 2020 2:01 PM
చారిత్రక నగరం హైదరాబాద్ అందాలకు మరింత శోభను తీసుకొచ్చిన దుర్గం చెరువు తీగల వంతెనపై సందర్శకుల సందడి నెలకొంది. కేబుల్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పోలీసులు ఇవాళ నిషేధించారు. కేవలం సందర్శకులను మాత్రమే వంతెనపైకి అనుమతిస్తున్నారు. దీంతో బ్రిడ్జి మొత్తం పర్యాటకులతో నిండిపోయింది. వంతెనపై సెల్పీలు తీసుకునేదుకు యువత ఆసక్తి చూపుతున్నారు.
వారాంతాల్లో ప్రజల సందర్శణకు అనువుగా శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కేబుల్ బ్రిడ్జిని మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు తీగల వంతెనపై వాహనాలకు అనుమతిలేదని తెలిపారు. ఈ మూడురోజులు పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
ఇక మరోవైపు వంతెన పైనుంచి వెళ్లే వాహనదారులు కూడా రోడ్డు పక్కన కార్లు, బైక్లు ఆపి కాసేపు అక్కడ సేదతీరుతుండడం ఎక్కువైంది. దీంతో వంతెన రోడ్డుపై ఎక్కువగా వాహనాలు నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్కు సాఫీగా కదలడం కష్టమవుతోంది. అయితే, దీన్ని గమనించిన జీహెచ్ఎంసీ అధికారులు వంతెనపై వాహనాలు నిలపకుండా నిషేదం విధించారు.సీసీటీవీ కెమెరాల్లో చూసి వాహనాలు ఆపిన వారికి చలాన్లు వేస్తున్నారు. అయినా జనాల తీరు మారకపోవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారం చేపట్టారు. ‘‘బిగ్బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు.. దుర్గం చెరువు బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే చలానా పడుతుంది.’’ అని ప్రచారం మొదలుపెట్టారు