బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
By: Sankar Tue, 08 Sept 2020 4:20 PM
రెండు రోజుల క్రితం అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ నాలుగవ సీజన్ అత్యంత అట్టహాసంగా ప్రారంభం అయింది..మొత్తం పదహారు మంది కంటెస్టెంట్ లలో పద్నాలుగు మంది బిగ్ బాస్ హౌస్ లో వెళ్లగా ఇంకో ఇద్దరినీ మాత్రం సీక్రెట్ రూంలో పెట్టారు..అయితే ఈ షో పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు.
ఈ షో వల్ల ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. "అంగరంగ వైభవంగా బిగ్బాస్ షోను ప్రారంభించారు. అది చూస్తుంటే హిమాలయంలో ఉన్న సాంస్కృతిక సంఘాన్ని తీసుకువచ్చి ఈ మురికి కుంటలో పడేసినట్లు ఉంది. విజయ్ మాల్యా జీవించే భవనాలు ఎంత విలాసంగా ఉన్నాయో, అంతకు మించి బిగ్బాస్ హౌస్ ఉంది. యువతీ యువకుల్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. వందరోజుల పాటు ఇంట్లోనే పెడతారట.
నాగార్జున షోలో ఒక యువకుడిని పిలిపించి.. ముగ్గురు సినిమా హీరోయిన్ల ఫొటోలను చూపించి వారి గురించి చెప్పమంటాడు. అప్పుడా యువకుడు ఒకమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఒకమ్మాయితో డేటింగ్ చేస్తా, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. ఇదేనా యువతీయువకులకు మీరిచ్చే సందేశం. 100 రోజుల పాటు లోపలే ఉంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయడం ఘోరం. ఇలా అనైతిక చర్యలకు పాల్పడటాన్ని మేము ఖండిస్తున్నాం. కళామతల్లికి అన్యాయం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కోట్ల మంది ప్రజలను టీవీ ముందు కూర్చోబెడుతూ సాంస్కృతిక దోపిడీ జరుగుతోంది. ఇలాంటి అనైతిక షోలను ప్రజలు ఆదరించవద్దు" అని నారాయణ పిలుపునిచ్చారు.