కడప సెంట్రల్ జైల్లో 333 మందికి కోవిడిపాజిటివ్ కేసులు
By: Dimple Thu, 20 Aug 2020 00:42 AM
కడప సెంట్రల్ జైలులో 333మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక్కడ శిక్ష పడ్డ ఖైదీలు, రిమాండ్ ఖైదీలు కలిపి మొత్తం 703మంది ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి కూడా పాజిటివ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో తాజాగా 830 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం పాజిటివ్లు 34,782కు చేరాయి. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఓ అధికారికి, కర్నూలు కార్పొరేషన్ కార్యాలయంలో ఓ అధికారికి కొవిడ్ సోకింది. రుద్రవరం మండలం చందలూరు గ్రామంలో 25మందికి వ్యాధి నిర్ధారణ కాగా, వారందరినీ నంద్యాల కొవిడ్ ఆస్పత్రికి తరలించారు.
ఆలూరు మండలంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ లైన్మన్కు పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్కు వెళ్లనని మొండికేయడంతో వైద్యశాఖ అధికారులు జోక్యం చేసుకొని ఆయన్ను ఆదోని క్వారంటైన్కు తరలించారు. గుంటూరు జిల్లాలో మరో 895మందికి వైరస్ సోకింది. గుంటూరు నగరంలో 134, నరసరావుపేటలో 120, మాచర్లలో 91 చొప్పున కేసులు నమోదయ్యాయి.
చిత్తూరు జిల్లాలో మరో 794మందికి కరోనా సోకినట్టు జిల్లా యంత్రాంగం గుర్తించింది. బాధితుల్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు, ఆరుగురు తిరుమల వాసులు ఉన్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో డ్రైవరుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగికి, కలకడ మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో పనిచేసే అధికారికి, కేవీపల్లె మండలం ఎంవీపల్లె పంచాయతీ సచివాలయంలో ఒకరికి వైరస్ నిర్ధారణ అయింది.