కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న యూరోప్..
By: Sankar Sun, 01 Nov 2020 12:01 PM
కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది. రోజువారీ కేసుల సంఖ్యలు పెరుగుతుండటంతో.. మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి ఐరోపా దేశాలు. అమెరికా, ఐరోపాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రతిరోజూ దాదాపు లక్ష వరకు కొత్త కేసులు వస్తున్నాయి. యూఎస్లో మొత్తం కేసుల సంఖ్య 94 లక్షలకు చేరువ అవుతోంది.
బ్రిటన్లో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. దీంతో ఆ దేశంలో రెండో లాక్డౌన్ మళ్లీ ప్రారంభం అవుతున్నట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. నెలరోజులపాటు ఈ లాక్డౌన్ కొనసాగనుంది. జర్మనీలో సోమవారం నుంచి లాక్డౌన్ అమలుకానుంది. జర్మనీలో ప్రతిరోజూ దాదాపు 20వేల కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ అమలు చేయనున్నారు.
బెల్జియం కూడా ఇవాళ రాత్రి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం.. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ఏర్పడటంతో.. లాక్ డౌన్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని బెల్జియం ప్రధాని ప్రకటించారు. డిసెంబరు 13 వరకు బెల్జియంలో లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఇక ఫ్రాన్స్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన లాక్ డౌన్.. నాలుగు వారాలపాటు కొనసాగనుంది.
మరోవైపు గ్రీస్లో కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రమే ఉన్న పరిమితుల్ని.. దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. గ్రీస్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు ఇచ్చారు. ఐరోపాలో మొత్తం కేసుల సంఖ్య కోటి దాటగా.. గత వారంలోనే 15 లక్షల కేసులు వచ్చాయి. దీంతో చాలాదేశాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి