కరోనా తీవ్రతను తగ్గించవచ్చు...పరిశోధనలో వెల్లడి
By: chandrasekar Sat, 10 Oct 2020 7:43 PM
కరోనా మహమ్మారిపై అనేక
దేశాల శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు కరోనా కట్టడికి
వ్యాక్సిన్ను తయారు చేస్తూనే మరోవైపు ఆ మహమ్మారి తీవ్రతపై పరిశోధనలను
జరుపుతున్నారు. రోగ నిరోధక శక్తిని అనుసరించి కరోనా ఆయా వ్యక్తులపై ప్రభావం
ఉంటుందని చెబుతున్నారు. కరోనా బారిన పడిన సమయంలో వివిధ అవయవాలను దెబ్బతీస్తూ తీవ్ర
నష్టాన్ని కలిగించకుండా ఉండేందుకు పలు మార్గాలున్నాయని శాస్త్రవేత్తలు
పేర్కొన్నారు. ప్రధానంగా మానవ శరీరంలో కరోనా ఎలా దాడి చేస్తుంది? వివిధ
అవయవాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలు
చేస్తున్నారు.
వైరస్ ప్రభావం తగ్గించే
పరిశోధనలో భాగంగా ఆరోగ్యకరమైన కణాలపై రోగ నిరోధక శక్తి పనిచేయకుండా ప్రేరేపించే
ప్రోటీన్లను అడ్డుకోవడం ద్వారా కరోనావైరస్ తీవ్రతను సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని
జాన్స్ హాష్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. చాలా మంది కరోనా రోగుల్లో
కనిపించే ఫ్యాక్టర్-డీ ఈ ప్రోటీన్ను నిరోధిస్తున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు
ఆయన తెలిపారు. ఇతర వ్యాధుల నియంత్రణ కోసం అభివృద్ధి చేస్తున్న చాలా ఔషధాల్లో
వీటిని అడ్డుకునే సామర్థ్యం ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఉపరితలంపై
కరోనా వైరస్ బంతిలా కనిపించేందుకు ఈ స్పైక్ ప్రోటీన్లే కారణమని శాస్త్రవేత్తలు
ఇప్పటికే నిర్ధారించారు. దీంతో కణాలు ఒకదానికొకటి జత కావడానికి అనుకూలంగా
మారుతున్నట్లు గుర్తించారు. అంతేగాక, ఇవి రక్తనాళాలు, సున్నితమైన కండరాలపై అంటుకునేలా చేస్తాయని
కనుగొన్నారు. ఆ తర్వాత క్రమంలో అవయవంలోని కణాలపై దాడి చేసి కణం లోపలికి
ప్రవేశిస్తాయి. ఇదే సమయంలో వైరస్ కణాలలోకి చొచ్చుకుపోకుండా ఫ్యాక్టర్-హెచ్
అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు కొనుగొన్నారు.
ఫ్యాక్టర్-హెచ్
ఆరోగ్యకరమైన కణాలకు హాని కలిగించకుండా రోగ నిరోధక శక్తిని కలిగించడంలో కీలకమని
గుర్తించారు. శరీర కణాలలోకి వైరస్ చొచ్చుకుపోకుండా ఫ్యాక్టర్ హెచ్ కూడా ఎంతో
సహాయపడుతుందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో వైరస్ ప్రభావ తీవ్రత
మానవ శరీర అవయవాలపై తగ్గుతుందని పేర్కొన్నారు. కాగా, అమెరికాలోనే కరోనా కేసులు
అధికంగా ఉన్న విషయం తెలిసిందే. మరణాలు కూడా ఈ దేశంలోనే ఎక్కువ జరిగాయి. రష్యా, భారత్, అమెరికా దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందువరుసలో
ఉన్నాయి.