మహేష్ను ‘గారు’ అని సంబోధిస్తూ ట్వీట్ చేసిన దళపతి విజయ్
By: chandrasekar Wed, 12 Aug 2020 11:42 AM
ఎంపీ జోగినిపల్లి సంతోష్
కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ను టాలీవుడ్ స్టార్లు ముందుకు తీసుకెళ్తున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి విశేష మద్దతు లభిస్తోన్న
విషయం తెలిసిందే. తాము మొక్కలు నాటడంతో
పాటు ఈ మంచి కార్యక్రమానికి మరికొంత మంది స్టార్లను నామినేట్ చేస్తున్నారు. ఆగస్టు
9న తన
పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటిన సూపర్
స్టార్ మహేష్ బాబు ఈ ఛాలెంజ్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ
స్టార్ హీరో విజయ్, హీరోయిన్ శృతిహాసన్ను నామినేట్ చేశారు.
మహేష్ బాబు ఛాలెంజ్ను
స్వీకరించిన దళపతి విజయ్ మంగళవారం చెన్నైలోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ
సందర్భంగా తీసుకున్న ఫొటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, మహేష్ను
‘గారు’ అని సంబోధిస్తూ ట్వీట్ చేయడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ను విపరీతంగా
ఆకర్షిస్తోంది. ‘‘ఇది మీకోసమే మహేష్ బాబు గారు. హరిత భారతం, మంచి
ఆరోగ్యం కోసమే ఇది. థాంక్యూ.. సురక్షితంగా ఉండండి’’ అని విజయ్ తన ట్వీట్లో
పేర్కొన్నారు. విజయ్ ట్వీట్కు ఇటు మహేష్ అభిమానులు, అటు విజయ్ ఫ్యాన్స్ నుంచి
విపరీతమైన స్పందన లభిస్తోంది.
విజయ్ ట్వీట్కు మహేష్
బాబు కూడా స్పందించారు. ‘‘ఈ ఛాలెంజ్ను స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు సోదర.
సురక్షితంగా ఉండండి’’ అని మహేష్ రిప్లై ఇచ్చారు. కాగా, ఇప్పటి
వరకు ఈ ఛాలెంజ్లో టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే పాల్గొన్నారు. కానీ, ఇప్పుడు
తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరో ఈ ఛాలెంజ్లో పాల్గొనడం విశేషం.