కేంద్రాన్ని రూ.5000 కోట్లు అడిగిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
By: chandrasekar Mon, 01 June 2020 12:52 PM
కరోనా లాక్ డౌన్
కారణంగా ఢిల్లీలో ఆదాయం గణనీయంగా పడిపోయిందని, ప్రస్తుతం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆ
రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన రూ.5000 కోట్లు సాయం కోరారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం
కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు.
‘ఇలాంటి కష్ట
సమయంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు సాయం చేయాలి.’ అని ఆ ట్వీట్లో
పేర్కొన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మనీష్ సిసోడియా కేంద్రాన్ని రూ.5000 కోట్ల సాయం కోరారు. ఇతర రాష్ట్రాలకు
ఇచ్చినట్టు ఢిల్లీకి డిజాస్టర్ మేనేజ్ మెంట్ సాయం ఏమీ అందలేదని చెప్పారు.
ఉద్యోగుల వేతనాలు,
ఇతర ఖర్చులకు ఢిల్లీకి
కనీసం రూ.3500 కోట్లు అవసరం
అవుతుంది. ‘గత రెండు నెలలుగా జీఎస్టీ వసూళ్లకు సంబందించి ఢిల్లీకి నెలకు రూ.500 కోట్లే వచ్చాయి. వేతనాలు, ఇతర చెల్లింపుల కోసం రెండు నెలలకు కనీసం రూ.7000 కోట్లు ఖర్చవుతుంది. కరోనా వైరస్ కష్ట సమయంలో
ఎంతోమంది కష్టపడుతున్నారు. అందులో ఫ్రంట్ లైన్ వారియర్లు కూడా ఉన్నారు.’ అని
వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్లో సిసోడియా అన్నారు.
కరోనా కారణంగా
ఆదాయం తగ్గిపోయినందుకే వీలైనంత త్వరగా సడలింపులు ఎక్కువ ఇవ్వాలంటూ ఇటీవల
కేజ్రీవాల్ పదే పదే కేంద్రాన్ని కోరారు.
తాజాగా కేంద్రం
ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే లాక్ డౌన్ను జూన్ 30 వరకు పొడిగించింది. అయితే, ఢిల్లీలో 120 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కరోనా కేసుల్లో
మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ, గుజరాత్ పోటీ
పడుతున్నాయి.