తెలంగాణ సీఎం కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన మల్లు బట్టి విక్రమార్క
By: Sankar Mon, 14 Dec 2020 6:02 PM
తెలంగాణలో పాలన అంతా అయోమయంగా సాగుతోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులను, ఇటు ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ నుంచి నయా రాచరిక పాలన చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
సోమవారం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ రెండేళ్ల పాలనపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికారులు ఎవరు ఎక్కడ ఉంటారో.. ఎవరికి తెలియని పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. సెక్రటేరియట్లో ఏ శాఖకు ఫోన్ కలవని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు..
గ్రేటర్ ఎన్నికల ముందు ప్రకటించిన వరద సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్నికల తరువాత ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 57 ఏళ్లకే పెన్షన్ అని చెప్పిన కేసీఆర్.. కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం.. తరువాత దానిని మర్చిపోయిందన్నారు. ఆన్లైన్ తరగతులకు సరైన వసతులు కల్పించకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు.
ధరణితో తెలంగాణ గందరగోళంలో పడిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తనకు కావాల్సిన వారికోసం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను గందరగోళం చేశారని ఆరోపించారు. వ్యవసాయ రంగం అతలాకుతలం అవుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు