రోజు రోజుకూ పెరుగుతున్న చైనా దురాక్రమణలు...
By: chandrasekar Mon, 07 Dec 2020 11:54 AM
సరిహద్దుల్లో విస్తరణవాద
కాంక్షతో రగిలిపోతున్న చైనా .. భారత్తో వాస్తవాధీన రేఖను మార్చేందుకు చేయని
ప్రయత్నం లేదు. భారత భూభాగాలను ఆక్రమించేందుకు అన్ని కుట్రలను అమలు చేస్తోంది.
ఇప్పటికే తూర్పు లడఖ్లోని పలు ప్రాంతాల్లోకి చైనా సైన్యం చొచ్చుకురావడంతో గత ఏడు
నెలలుగా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజాగా, చైనా
మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. అరుణాచల్ ప్రదేశ్కు కూతవేటు దూరంలో కొత్తగా మూడు
గ్రామాలను నిర్మించింది. భారత్, చైనా, భూటాన్లకు సరిహద్దుగా ఉన్న బమ్లా పాస్కు 5
కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామాలను ఏర్పాటుచేసింది. ఈ గ్రామాలలో 960
కుటుంబాలకు చెందిన 3,222 మంది హాన్ చైనీయులు, కమ్యూనిస్టు పార్టీకి
చెందిన టిబెటన్లను తరలించేందుకు చైనా సమాయత్తమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ
వాదిస్తోన్న చైనా.. దీనిని స్వాధీనం చేసుకోడానికి పన్నాగాలు చేస్తోంది.
సరిహద్దుల్లో దురాక్రమణలే లక్ష్యంగా డ్రాగన్ ఈ కుట్రకు పాల్పడిందని చైనా వ్యవహారాల
పరిశీలకులు డాక్టర్ బ్రహ్మ చెల్లనే అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే మొదటి వారంలో
తూర్పు లడఖ్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడటానికి ముందే ఫిబ్రవరి 17నాటికే
ఇక్కడ చైనా 20కి పైగా ఇళ్లను నిర్మించినట్లు ఉపగ్రహాలు తీసిన
ఫొటోల్లో తెలిసింది.
దక్షిణ చైనా సముద్రంలో
మత్స్యకారులను ఉపయోగించినట్లుగా.. చైనా పౌరులు, పశువుల కాపర్లు, గ్రాజర్లను భారత్ సైన్యం గస్తీ నిర్వహించే హిమాలయ
ప్రాంతాల్లోకి చొరబడేందుకు ఈ వ్యూహానికి తెరతీసిందని డాక్టర్ బ్రహ్మ అన్నారు.
ఇటీవల భూటాన్ భూభాగంలో డోక్లాం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామాన్ని
చైనా నిర్మించినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించిన రెండు వారాల తర్వాతే తాజాగా
అరుణాచల్ వద్ద నిర్మాణాలు బయటపడ్డాయి. ఈ గ్రామాలు తమ భూభాగంలోనే ఉన్నాయని
బుకాయిస్తోన్న చైనా.. తూర్పు లడఖ్లో ఇరు సైన్యాల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలోనే
ఏర్పాటు చేసింది. 1962 తర్వాత తొలిసారిగా భారత్-చైనాల మధ్య ప్రస్తుతం
ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఎనిమిది దశల్లో చర్చలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం.
తాజాగా బయటపడ్డ ఉపగ్రహ చిత్రాల్లో ఒక్కో గ్రామంలో 20 నుంచి 50 వరకు
నిర్మాణాలు ఉన్నాయి.
ఈ ప్రాంతంలోని సరిహద్దు
చట్టబద్ధ స్థితిని చైనా వివాదం చేస్తోంది.. చైనా మ్యాప్లు దక్షిణ టిబెట్
ప్రాంతంలో భాగంగా 65,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని వాస్తవాధీన రేఖకు
దక్షిణాన చూపిస్తూనే ఉన్నాయి. 1914 సిమ్లా ఒప్పందంలో బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ సర్
హెన్రీ మెక్మోహన్ ప్రతిపాదించిన చారిత్రాత్మక మెక్మోహన్ రేఖ ఇక్కడ సరిహద్దును
నిర్వచిస్తుందని దశాబ్దాలుగా చైనా చేస్తున్న వాదనను భారత్ తిరస్కరిస్తోంది. భారత
భూభాగాన్ని ఆక్రమించుకోడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను 2017
సెప్టెంబర్లో ప్రస్తుత సీడీఎస్ చీఫ్, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు.
‘ఉత్తరాన ఉన్న విరోధికి సంబంధించినంత వరకు వారి ప్రయత్నాలను తిప్పికొట్టే చర్య
మొదలయ్యింది. అక్రమణలో ఉన్న భూభాగాన్ని క్రమంగా స్వాధీనం చేసుకోవడం, హద్దులను
పాటిస్తూ ఒప్పందాలను గౌరవించాలని జనరల్ రావత్ చైనాకు స్పష్టం చేశారు.