ఎంపీ ఇంట్లో సోదాలపై ప్రకటన చేసిన సిబిఐ
By: Sankar Thu, 08 Oct 2020 10:25 PM
బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలపై గురువారం సీబీఐ మీడియాకు ప్రెస్నోట్ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొంది.
రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. దీనిలో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్నోట్లో పేర్కొంది..
ఈనెల 6న హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టారు. ఇండ్-భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. ఈ దాడుల్లో పలు కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.