కోహ్లీ లేకుంటే కెప్టెన్ గా రోహిత్ కంటే ఆ ఆటగాడు బెస్ట్ ...బ్రాడ్ హాగ్
By: Sankar Thu, 19 Nov 2020 06:19 AM
ఈ ఏడాది ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా గతవారమే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 25 మందితో కూడిన భారత బృందం అక్కడకు చేరుకుంది.
భారత ఆటగాళ్లు అందరూ 14 రోజుల పాటు నిబంధనలను పాటిస్తూ.. సాధన మొదలుపెట్టారు. నవంబర్ 27న ప్రారంభమై జనవరి 27న ముగిసే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నాడు. కోహ్లీ లేని సమయంలో భారత జట్టుకు కెప్టెన్ను ఎవరిని చేయాలనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించడంతో కెప్టెన్సీ పగ్గాలు అతనికే ఇవ్వాలని కొందరు అంటున్నారు. మరికొందరేమో రోహిత్ కేవలం టీ20 ఫార్మాట్లోనే సక్సెస్ అవుతున్నాడని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఓ అడుగు ముందుకేసి.. రోహిత్ కెప్టెన్సీకి పనికిరాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
విదేశాల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు సరిగా రాణించింది లేదని, బ్యాటింగ్లోనే సరిగా రాణించని వ్యక్తికి కెప్టెన్సీ ఎలా అప్పగిస్తారంటూ బ్రాడ్ హాగ్ ప్రశ్నించాడు. రోహిత్ కంటే టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే చక్కగా ఆడగలడని, అతడికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు.